Tollywood : సూడు పిన్నమ్మ పాడు పిల్లాడు.. ఈ నటుడి జీవితం గురించి తెలుసా.. ? ఏకంగా 300 సినిమాలు..

'సూడు పిన్నమ్మ పాడు పిల్లాడు.. పైన పైన పడత ఉన్నడు'.. ఈ సాంగ్ గుర్తుందా.. ? ఇప్పటికీ ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్. సంవత్సరాలుగా సినీరంగంలో ఈ పాటకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే ఇందులో నటించిన ఆ నటుడు సైతం ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన విలక్షణమైన శైలితో ప్రేక్షకులను అలరించిన గొప్ప నటుడు ఆయన.

Tollywood : సూడు పిన్నమ్మ పాడు పిల్లాడు.. ఈ నటుడి జీవితం గురించి తెలుసా.. ? ఏకంగా 300 సినిమాలు..
Mada Venkateswara Rao

Updated on: Feb 05, 2026 | 12:26 PM

తెలుగు సినీ చరిత్రలో తనదైన విలక్షణమైన శైలితో, అరుదైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన గొప్ప నటుడు మాడా వెంకటేశ్వరరావు. స్పెషల్ పాత్రలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయన సినీరంగంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా ముత్యాల ముగ్గు చిత్రంలో రావు గోపాలరావుతో జరిగిన సంభాషణలు, కేవలం రెండు నిమిషాల నిడివి ఉన్నా ఆయన అద్భుతమైన డైలాగ్ డెలివరీకి, హాస్యచాతుర్యానికి నిదర్శనంగా నిలిచాయి. దాసరి నారాయణరావు రూపొందించిన చిల్లరకొట్టు చిట్టెమ్మ చిత్రంలోని పువ్వుల పున్నయ్య పాత్ర మాడా కెరీర్‌కు పువ్వుల బాట వేసిందనే చెప్పాలి. ఈ చిత్రం ఆయన పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత కాలంలో ఇలాంటి విలక్షణమైన పాత్రలకు పున్నయ్య పాత్ర మార్గదర్శకంగా నిలిచిందని చెప్పవచ్చు. ఇలాంటి పాత్రలు పోషించడానికి ఆయన ఎప్పుడూ చిన్నబుచ్చుకోలేదు. “ఎవరు వెయ్యకపోతే ఇలాంటి పాత్రలకు ప్రాణం ఎవరు పోస్తారు?” అన్నట్లుగా ప్రతి పాత్రలోనూ వైవిధ్యాన్ని చూపిస్తూ తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.

మాడా వెంకటేశ్వరరావు అక్టోబర్ 10, 1950న తూర్పు గోదావరి జిల్లా కడియంలో జన్మించారు. ఏడిద, మండపేట స్కూల్స్‌లో చదువుకునే రోజుల్లోనే నటనపై ఆసక్తి ఉండేది. అప్పట్లోనే ముద్దబ్బాయి నాటికలో నటించి అందరినీ కడుపుబ్బ నవ్వించారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో బీఏ చదువుతున్నప్పుడు కల్చరల్ సెక్రటరీగా వ్యవహరించారు. కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నప్పుడు కాలేజీ నాటకాల్లోనే కాకుండా బాపత్ సంస్థల నాటకాల్లో కూడా నటించారు. రంగస్థల హాస్యనటుడు గండికోట జోగినాధం ఆయన గురువుగా హాస్యం పట్ల ఆసక్తిని పెంచారు. హైదరాబాదులో విద్యుత్ శాఖలో ఇంజనీర్‌గా పనిచేస్తూనే ఆల్ ఇండియా రేడియో నాటకాల్లో పాల్గొన్నారు. జర్నలిజం ఆయనకు ఒక అభిరుచి. సినీ జనతా పత్రికలో కూడా పనిచేశారు.

ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అక్కినేని నాగేశ్వరరావుతో పరిచయం ఏర్పడటంతో, ఆయన ప్రోత్సాహంతో సుడిగుండాలు చిత్రంతో హాస్యపాత్ర ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ ఆ తర్వాత జై జవాన్, అమాయకురాలు, అక్కాచెల్లెలు, ఉండమ్మా బొట్టు పెడతా వంటి చిత్రాల్లో నటించారు. సిసింద్రీ చిట్టిబాబులో తాగుబోతు జోగులు, భాగ్యవంతుడు చిత్రంలో తెలుగు టీచర్ పాత్రలు ప్రశంసలు అందుకున్నాయి. అప్పటివరకు హైదరాబాదులో జరిగిన షూటింగ్‌లలోనే పాల్గొన్న మాడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం 1972 జనవరి 1న మద్రాసులో అడుగుపెట్టారు. ఎన్టీఆర్ (కులగౌరవం, డ్రైవర్ రాముడు – క్లీనర్ పాత్ర, శ్రీమద్విరాట్ పర్వం – ఉత్తర కుమారుడు), ఏఎన్ఆర్ (అందాల రాముడు), కృష్ణంరాజు (వింత దంపతులు), చలం (ఊరికి ఉపకారి, పెద్ద కొడుకు, పల్లెటూరి బావ, నేరము – శిక్ష) వంటి ఎందరో ప్రముఖ నటులతో కలిసి నటించి పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ తన సొంత చిత్రాల్లో మాడాకు మంచి వేషాలిచ్చి ప్రోత్సహించేవారు.

ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..

ఇన్ని చిత్రాల్లో నటించినా రాని గుర్తింపు ముత్యాల ముగ్గు సినిమాతో వచ్చి ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత చిల్లరకొట్టు చిట్టెమ్మ చిత్రం ఆయనకు పరిశ్రమలో సుస్థిర స్థానం ఏర్పరిచింది. మూడు దశాబ్దాలపాటు నటుడిగా కొనసాగి దాదాపు 300 చిత్రాల్లో నటించారు. 2004లో వచ్చిన సఖియా ఆయన నటించిన చివరి చిత్రం. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 2015 అక్టోబర్ 24న మాడా కన్నుమూశారు. ఆయనకు నలుగురు కుమార్తెలు. “తేడా పాత్రలు పోషించడం ఎప్పుడూ అగౌరవంగా భావించలేదు. మా బాధల్ని నీ నవ్వులతో మాయ చేసి తెరపై చూపిస్తున్నావు భయ్యా” అని హిజ్రాలు తనతో చెప్పిన మాటలే తనకు లెక్కలేనన్ని అవార్డులు అని ఆయన చెప్పేవారు.

ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..