Tollywood 2025: టాలీవుడ్ రీ-ఎంట్రీ రిపోర్ట్.. పవన్ కళ్యాణ్ నుంచి ఆది వరకు దుమ్మురేపిన వీరులే..

ఒక్క హిట్ కోసం ఎన్నో ఏళ్లు ఎదురుచూస్తారు. ప్రతి సినిమా కోసం కష్టపడతారు. ఒక్కోసారి హిట్ అందుకుంటే మరోసారి నటనకు ప్రశంసలు అందుతాయి. అయితే, నటనపై ప్రశంసలతోపాటు బాక్సాఫీస్ దగ్గర కూడా సినిమా హిట్ టాక్ దక్కించుకుంటేనే ఫిదా అవుతారు హీరోలు ఆయన అభిమానులు.

Tollywood 2025: టాలీవుడ్ రీ-ఎంట్రీ రిపోర్ట్.. పవన్ కళ్యాణ్ నుంచి ఆది వరకు దుమ్మురేపిన వీరులే..
Og Thandel Shambala

Updated on: Dec 31, 2025 | 1:15 PM

సినిమా రంగంలో గెలుపోటములు సహజం. అయితే కొందరు హీరోలకు మాత్రం కాలం అస్సలు కలిసిరాదు. వరుస పరాజయాలు పలకరిస్తున్న వేళ, కెరీర్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తరుణంలో 2025 ఏడాది టాలీవుడ్ టాప్ హీరోలకు కొత్త ఊపిరి పోసింది. దాదాపు పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ కొందరు, ఐదేళ్లుగా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న మరికొందరు ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటారు. పవన్ కళ్యాణ్ నుంచి ఆది సాయికుమార్ వరకు ఈ ఏడాది కమ్‌బ్యాక్ ఇచ్చిన ఆ టాప్ 10 హీరోల సక్సెస్ ట్రాక్ ఇక్కడ చూద్దాం.

గ్యాంగ్‌స్టర్‌గా బాక్సాఫీస్ షేక్ చేసిన పవర్‌ స్టార్

చాలా కాలంగా తనదైన సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆ స్టార్ హీరోకు ఈ ఏడాది చిరస్మరణీయంగా నిలిచింది. దాదాపు దశాబ్దం క్రితం వచ్చిన ఇండస్ట్రీ హిట్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి వసూళ్లు ఆయన ఖాతాలో పడలేదు. ఈ నేపథ్యంలో సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ సుమారు రూ.300 కోట్ల వసూళ్లు సాధించి అభిమానుల ఆకలి తీర్చింది.

ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించిన విక్టరీ

మరో సీనియర్ స్టార్ హీరోకు గత కొన్ని ఏళ్లుగా అదృష్టం కలిసిరాలేదు. ప్రయోగాత్మక చిత్రాలు చేసినా ఆశించిన ఫలితం దక్కలేదు. అయితే తనకు అచ్చొచ్చిన కామెడీ జానర్‌లో అనిల్ రావిపూడితో జతకట్టి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ థియేటర్లలో సందడి చేశారు. ఈ మూవీ రూ.300 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులను తుడిచిపెట్టేసింది.

సీనియర్ల హవా.. క్యారెక్టర్ రోల్స్‌లోనూ మెరుపులు

కింగ్ నాగార్జున ఈ ఏడాది విలక్షణమైన దారిని ఎంచుకున్నారు. ధనుష్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘కుబేర’ లో కీలక పాత్ర పోషించి మెప్పించారు. శేఖర్ కమ్ముల మార్క్ మేకింగ్‌లో నాగ్ నటనకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక హీరో సుమంత్ సైతం ‘అనగనగ’ అనే వెబ్ ఫిల్మ్‌తో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై భారీ విజయాన్ని అందుకున్నారు. ఇది ఓటీటీలో అత్యధిక వీక్షణలు పొందిన చిత్రంగా నిలిచి ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది.

అక్కినేని వారసుడి ‘తండేల్’ మ్యాజిక్

కొంతకాలంగా వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న నాగచైతన్యకు 2025 గొప్ప ఊరటనిచ్చింది. చందూ మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మత్స్యకారుల జీవిత నేపథ్యంతో సాగే ఈ కథ చైతూ కెరీర్‌ను మళ్ళీ ట్రాక్‌లోకి తెచ్చింది.

విలన్‌గా మారి సక్సెస్ అందుకున్న మనోజ్

సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై కనిపించిన మంచు మనోజ్ ఈసారి రూట్ మార్చారు. తేజ సజ్జా హీరోగా నటించిన ‘మిరాయ్’లో పవర్‌ఫుల్ విలన్ పాత్రలో అదరగొట్టారు. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత వచ్చిన మనోజ్‌కు ఈ మూవీ సెకండ్ ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేసింది. హీరో కంటే ఎక్కువగా మనోజ్ పాత్ర గురించే చర్చ జరగడం విశేషం.

పోరాడి గెలిచిన కుర్ర హీరోలు

రామ్ పోతినేని ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత ఆ స్థాయి హిట్ కోసం చేసిన ప్రయత్నం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’తో ఫలించింది. ఇది మిశ్రమ ఫలితాన్ని అందుకున్నా, రామ్‌కు ఒక మాస్ కమ్‌బ్యాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’తో బాక్సాఫీస్ వద్ద మళ్ళీ తన ఫామ్‌ను నిరూపించుకున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ కామెడీ హారర్ మూవీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది.

క్రిస్మస్ రేసులో ఆది, రోషన్ మేక

ఏడాది చివర్లో విడుదలైన ‘శంబాల’ చిత్రంతో ఆది సాయికుమార్ భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. హిట్ లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ మూవీ ఆయనకు తిరుగులేని విజయాన్ని అందించింది. మరోవైపు శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేక ‘ఛాంపియన్’ మూవీతో క్రిస్మస్ రేసులో నిలిచారు. వసూళ్ల పరంగా ఈ చిత్రం మంచి జోరు చూపిస్తూ రోషన్‌కు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చింది.

మొత్తానికి 2025 ఏడాది టాలీవుడ్‌లో పోగొట్టుకున్న ఫామ్‌ను తిరిగి పొందేందుకు చాలా మంది హీరోలకు అద్భుతమైన అవకాశంగా మారింది.