
ఈ రోజుల్లో ఒక సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, ఆ సినిమాను ప్రమోట్ చేయడం అంతకంటే పెద్ద సవాలుగా మారింది. పెద్ద నిర్మాతలు అయితే భారీ బడ్జెట్లతో ప్రమోషన్స్ను దుమ్మురేపుతుంటారు. కానీ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో రూపొందే చిన్న సినిమాల పరిస్థితి మాత్రం అంత సులభం కాదు. అయితే ఇటీవల ఒక సినిమా మాత్రం తన వినూత్నమైన ప్రమోషన్స్తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే “మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్”. సినిమా కాన్సెప్ట్ మాత్రమే కాకుండా, ఈ చిత్రబృందం చేస్తున్న ప్రచార కార్యక్రమాలు కూడా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. రైతులకు ఉపయోగపడే అంశాన్ని ఈ సినిమాలో చూపించడంతో, సినిమా ప్రమోషన్ను కూడా రైతుల మధ్య నుంచే ప్రారంభించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన రాజేందర్ రెడ్డి రైతుబడి అగ్రి షోలో చిత్రబృందం ప్రత్యేకంగా ఒక స్టాల్ ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చిన రైతులకు సినిమా కాన్సెప్ట్ను వివరించారు. సాధారణంగా అగ్రికల్చర్ ఎగ్జిబిషన్లలో వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు, విత్తనాలు, కంపెనీల స్టాళ్లు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఒక సినిమాకు ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేయడం అరుదైన విషయమే అని చెప్పాలి.
అదేవిధంగా మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU)లో జరిగిన మెగా రైతు మేళాలో కూడా “మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్” సినిమా టీమ్ స్టాల్ ఏర్పాటు చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన మంత్రులు, అధికారులు, స్కాలర్లు, యాక్టివిస్టులు, మహిళా యాక్టివిస్టులు మరియు రైతులు మూవీ స్టాల్ను సందర్శించి చిత్రబృందాన్ని అభినందించారు. రైతుల కోసం వారు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రశంసించారు.
ప్రపంచమంతా స్మార్ట్ ఫార్మింగ్ వైపు సాగుతున్న ఈ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్చెయిన్ వంటి ఆధునిక సాంకేతికతలను సంప్రదాయ వ్యవసాయ జ్ఞానంతో కలిపి భవిష్యత్తులో వ్యవసాయం ఎలా అభివృద్ధి చెందవచ్చో ఈ చిత్రంలో చూపించారు. వ్యవసాయం మరియు సాంకేతికత మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశమని చిత్రబృందం చెబుతోంది. “మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్” సినిమా నేటి సామాజిక వాస్తవాలను ప్రతిబింబించే కథతో రూపొందుతోంది. వ్యవసాయంతో పాటు, ఆధునిక సమాజంలో పెరుగుతున్న విడాకుల సమస్యను కూడా ఈ చిత్రం ప్రస్తావిస్తుంది. మునుపటి తరాలు జంటలకు మార్గనిర్దేశం చేయడంలో, కుటుంబ విభేదాలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాయని ఈ సినిమా గుర్తుచేస్తుంది. ఆధునిక స్వాతంత్ర్యాన్ని సాంప్రదాయ కుటుంబ విలువలతో ఎలా సమతుల్యం చేయాలనే ప్రశ్నను ఈ చిత్రం ప్రేక్షకుల ముందుంచుతోంది.
సందేశాత్మక అంశాలను ప్రస్తావించినప్పటికీ, ఈ చిత్రం పూర్తిగా వినోదాత్మకంగా తెరకెక్కిందని చిత్రబృందం చెబుతోంది. దాదాపు 10 మంది ప్రముఖ కమెడియన్స్తో ఈ సినిమా నవ్వులు పంచేలా రూపొందించబడింది. యువత మరియు కుటుంబ ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని దర్శకనిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన “మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్” టీజర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రాన్ని CH.V.N.S బాబ్జి సమర్పిస్తున్నారు. లోటస్ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి మధుదీప్ చెలికాని దర్శకత్వం వహించగా, అరవింద్ మండ్యం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమాటోగ్రఫీని రవికుమార్ అందించగా, ఎడిటింగ్ బాధ్యతలను కోటగిరి వెంకటేశ్వరరావు నిర్వహిస్తున్నారు. సంగీతాన్ని అరుణ్ చిల్వేరు , ప్రకాష్ చెరుకూరి అందిస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని వేసవి సెలవుల్లో విడుదలకు సిద్ధంగా ఉంది.
ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట భయ్యా.. 29 ఏళ్లుగా ట్రెండింగ్.. మనసును హత్తుకునే సాంగ్.. వింటే వదలరు..
ఎక్కువమంది చదివినవి : Jr.NTR: ఆ విషయం పదే పదే చెప్పడం నాకు నచ్చదు.. ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే తెలుసుకోవాలి.. ఎన్టీఆర్..