Peddi Movie: రామ్ చరణ్పై ట్రోల్స్.. ఆ వెదవల పనేనంటూ జగ్గూభాయ్ షాకింగ్ కామెంట్స్
ఇటీవల పెద్ది ప్రమోషన్లలో భాగంగా రామ్ చరణ్ కొందరి ప్రముఖుల పేర్లు తప్పుగా పలికాడు. ఆ తర్వాత సారీ చెబుతూ ట్వీట్ చేశాడు. ఇక బెంగళూరు ఈవెంట్లోనూ కన్నడలో కొంచెం కొంచమే మాట్లాడటంతో కొంతమంది యాంటీ ఫ్యాన్స్ చరణ్ ని ట్రోలింగ్ చేస్తున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెది’ చిత్రం జూన్ 4 ప్రపంచవ్యాపంగా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్లలో చిత్ర బృందం బిజీ బిజీగా ఉంటోంది. రామ్ చరణ్ తో పాటు మూవీ యూనిట్ మొత్తం దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పర్యటిస్తూ పెద్ది సినిమాను ప్రమోట్ చేస్తోంది. అలాగే ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. కాగా బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా లో జగపతి బాబు ఓ కీలక పాత్ర పోషించారు. అప్పల సూరి అనే ఓ ఏజ్డ్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యుకు హాజరైన జగ్గూభాయ్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే రామ్ చరణ్ పై వస్తోన్న ట్రోల్స్ పై కూడా ఘాటుగా స్పందించారు. ‘లెజెండ్ తర్వాత నేను దాదాపు 100 సినిమాలు చేశానని అనుకుంటున్నాను. కానీ నాకు కేవలం 5-6 పాత్రలు మాత్రమే గుర్తుండిపోతాయి. అందులో పెద్ది సినిమాలోని అప్పలసూరి పాత్ర ఒకటి. ఈ సినిమా విడుదలయ్యాక, కచ్చితంగా ఆ పాత్రే అగ్రస్థానాన్ని దక్కించుకోవచ్చు’ అని జగ్గూభాయ్ చెప్పుకొచ్చారు.
ఇక చరణ్ పై వస్తోన్న ట్రోల్స్ పై స్పందించిన జగపతిబాబు.. ‘పనిలేని వెదవలు గురించి నేను ఎక్కువ మాట్లాడను. ట్రోలింగ్ చేసేవాళ్లు గుంటకాడ నక్కల్లాంటి వాళ్లు. వాళ్లకు పెద్దగా పని ఉండదు. దీంతో ఎవర్ని కిందకు లాగుదామా అని ఎదురు చూస్తుంటారు. రామ్ చరణ్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఎన్నో గాయాలు కూడా అయ్యాయి. ఎంత ఎఫర్ట్ పెట్టాడు, ఎంత కష్టపడ్డాడు ఇవన్నీ వదిలేసి ఏదో దొరికితే దాన్ని పట్టుకుంటారు. అసలు ఈవెంట్ లో అన్నివేల మంది జనాలు, ఓ పక్క డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ కు సంబంధించి హీరోకు కాల్స్ వస్తున్నాయి. అలాగే మరో పక్క థియేటర్స్ ఇష్యూ నడుస్తుంది. ఇవన్నీ హీరో తలపై ఉంటాయి. అవన్నీ మోస్తూ ఇంత హడావిడిలో కొన్ని విషయాలు మర్చిపోవడం సాధారణం. నేను కూడా అప్పుడప్పుడు కొన్ని విషయాలు మర్చిపోతాను. ఒత్తిడిలో ఇలాంటివి జరగడం సహజం. దీన్ని కూడా ట్రోల్స్ చేస్తారా… ఆ ట్రోలింగ్ చేసేవాళ్లు నాలుగు రోజులు మాట్లాడతారు పోతారు. దీనివల్ల రామ్ చరణ్ కు వచ్చిన ఇబ్బందేమీ కాదు. నన్ను కూడా ఏదో సీన్ కోసం 70, 80 టేక్స్ తీసుకున్నా అని ట్రోల్ చేశారు. అసలు అది అబద్దం. నేను మహా అయితే మూడు టేక్స్ తీసుకుంటాను. అదే హైయెస్ట్. దాన్ని కూడా ఫేక్ న్యూస్ తో ట్రోలింగ్ చేశారు. పని లేకుండా ఇదే పనిగా వాళ్లు ఏదోఒకటి చేస్తూనే ఉంటారు’ అని చెప్పుకొచ్చారు జగ్గూభాయ్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
