
ఐ బొమ్మ రవి విచారణలో రోజుకొక కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. టీవీ9తో మాట్లాడిన సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు కేసు పురోగతిపై పలు కీలక విషయాలను వెల్లడించారు. ఐ బొమ్మ రవిలో తప్పు చేశానన్న పశ్చాత్తాపం లేదని.. ఆయన చెప్పాలనుకున్నదే చెప్పినట్లు వివరించారు. టెక్నికల్ ఎవిడెన్స్ ముందుపెట్టాక కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇచ్చినట్లు తెలిపారు. ఎనిమిది రోజుల కస్టడీలో రవి ఇచ్చిన కన్ఫెషన్ ఆధారంగా సాక్షాలు సేకరణ జరుగుతోందని చెప్పారు. రవి మూడు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయని డీసీపీ తెలిపారు. ఆ ప్రమోషన్ల ద్వారా వచ్చిన డబ్బుతోనే అతను లావిష్ లైఫ్స్టైల్కు అలవాటు పడ్డాడని పేర్కొన్నారు. డబ్బు లావాదేవీలకు సంబంధించి ఇంకా సమాచారం రవి వద్దనే ఉందని.. అందుకే మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేశామని అరవింద్ బాబు అన్నారు. రవికి సంబంధించిన పలు ఆర్థిక లింకులు ఇంకా బయటపడాల్సి ఉందని తెలిపారు.
రవికి పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్ ఆఫర్ ఇచ్చిందని బయట జరుగుతున్న ప్రచారంపై కూడా డీసీపీ స్పందించారు.”ఐ బొమ్మ రవికి మేము ఎలాంటి జాబ్ ఆఫర్ ఇవ్వలేదు. బయట ఊహాగానాల్లో నిజం లేదు” అని ఆయన స్పష్టం చేశారు. ఐ బొమ్మ రవికి చెందిన ప్రాపర్టీలు హైదరాబాద్, విశాఖపట్నంలో గుర్తించినట్లు డీసీపీ వెల్లడించారు. అంతేకాకుండా ఐ బొమ్మతో అనుబంధంగా పనిచేస్తున్న మిర్రర్ సైట్లను పూర్తిగా మూసివేసినట్లు తెలిపారు. డీసీపీ అరవింద్ బాబు వ్యాఖ్యలతో కేసు దర్యాప్తు మరో దశకు చేరుకుందని స్పష్టమవుతోంది. రవి ఆర్థిక లింకులు, ప్రమోషన్ నెట్వర్క్, లావాదేవీలపై పూర్తి వివరాలను పోలీసులు రాబడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..