
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో రారాజుగా తనదైన ముద్ర వేసుకున్నారు. సన్నివేశానికి న్యాయం చేస్తూ గాత్రంతో నటనను పలికించగల అరుదైన గాయకుడు ఎస్పీబీ. భారతీయ సినీ రంగంలో వేలాది పాటలు పాడి, తెలుగు చిత్రసీమలో అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన మరణాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇండస్ట్రీలో ఆయనకు సాధారణంగా ఎవరితోనూ విభేదాలు లేవు, కానీ ఒకే ఒక్క హీరోతో మాత్రం ఆయనకు మనస్పర్థలు వచ్చాయి. ఒకే ఒక్క హీరోతో బాలు గొడవపడ్డారు. పలు ఇంటర్వ్యూల్లోనూ దీని గురించి ఆయన ప్రస్తావించారు. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.? ఆయన మరెవరో కాదు సూపర్ స్టార్ కృష్ణ.
సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్ ఆరంభంలో, బాలు అప్ కమింగ్ గాయకుడిగా ఉన్నప్పుడు ఆయనను ఎంతగానో ప్రోత్సహించారు. కృష్ణ సినిమాలకు బాలునే గాయకుడిగా పాడే అవకాశం కల్పించారు. నేనంటే నేనే చిత్రంతో వీరి అనుబంధం మరింత బలపడింది. ఇదే చనువుతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొందరు నిర్మాతలతో కలిసి, కే.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వంలో కెప్టెన్ కృష్ణ సినిమాను నిర్మించారు. ఈ సినిమా నిర్మాణం సమయంలో కృష్ణకు ఇవ్వాల్సిన 20,000 రూపాయల పారితోషికాన్ని బాలు ఇవ్వలేకపోయారు. బాలు కష్టాలను అర్థం చేసుకున్న కృష్ణ, ఆ విషయాన్ని మర్చిపోయి ఆయనకు సహాయపడ్డారు. అయితే, కొంతకాలం తర్వాత వీరి మధ్య ఒక వివాదం మొదలైంది. కృష్ణ సతీమణి విజయనిర్మల తన విజయకృష్ణ బ్యానర్లో పాటలు పాడమని బాలుని కోరాగా.. అప్పుడు బాలు తనకు రావాల్సిన 800 రూపాయలు ఇస్తేనే పాడతానని కబురు పంపారట. దీంతో కృష్ణకు కోపం వచ్చిందని చెబుతారు. బాలు కష్టాలను చూసి 20,000 రూపాయలు వదులుకున్న తాను, కేవలం 800 రూపాయల కోసం తమ బ్యానర్ని బాలు నిలదీయడం కృష్ణకు నచ్చలేదు. ఆ సమయంలో కృష్ణ, బాలుతో నేరుగా, “నువ్వు లేకుంటే నా సినిమాలు రిలీజ్ కావని చెప్పావా.?” అని నిలదీశారట. అయితే బాలు మాత్రం, ఎవరో గిట్టనివాళ్లు చెప్పిన మాటలను కృష్ణ అపార్థం చేసుకున్నారని భావించి చాలా ప్రశాంతంగా ఉండిపోయారు.
అదే సమయంలో కృష్ణ తనకు రావాల్సిన రెమ్యూనరేషన్ పంపించమని కోరడంతో, బాలు కృష్ణకి ఇవ్వాల్సిన 20 వేల రూపాయల బాకీని కూడా వెంటనే తీర్చేశారట. ఈ మనస్పర్థల కారణంగా కృష్ణ-విజయనిర్మల దర్శకత్వంలో తెరకెక్కిన సూర్యచంద్ర సినిమాలో బాలుతో కాకుండా రాజ్-సీతారామ్తో పాటలు పాడించారు. అప్పటినుండి కొన్నాళ్లపాటు కృష్ణ నటించిన పలు చిత్రాలకు రాజ్-సీతారామే గానం అందించారు. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నప్పటికీ కృష్ణ తన సినిమాల్లో బాలు సోదరి ఎస్.పి.శైలజతో పాటలు పాడించేవారు. కొంతకాలం గడిచాక, వీరిద్దరి మధ్య సయోధ్య కుదిరింది. కృష్ణ, ఎస్. ఎస్. రవిచంద్ర దర్శకత్వంలో రౌడీ నెంబర్ వన్ సినిమా తీసే సమయంలో సంగీత దర్శకులు రాజ్-కోటి, కృష్ణ దగ్గరకు వెళ్లి ఈ సినిమాలో పాటలు బాలు గారు పాడితే బాగుంటుందని సూచించారు. వేటూరి మధ్యవర్తిత్వంతో బాలును ఒప్పించారట. బాలు కూడా ఎలాంటి మొహమాటం లేకుండా పద్మాలయ స్టూడియోలో కృష్ణ గారిని కలిశారట. అప్పుడు కృష్ణ ఇంతకు ముందు జరిగిన విషయాలను ఇద్దరం మర్చిపోదాం, మన ఇద్దరం కలిసి మళ్లీ పని చేద్దాం అని బాలుతో చెప్పారట. ఆ రోజు నుండి తిరిగి కృష్ణ చిత్రాలకు బాలు పాటలు పాడడం ప్రారంభించారు. కృష్ణ ఎంతమంది నిర్మాతలు కష్టాలను అర్థం చేసుకుని, వారికి రావాల్సిన పారితోషికాలను కూడా అడిగేవారు కాదన్న విషయం, ఆయన గొప్ప మనసును తెలియజేస్తుంది.