
2003లో ఐతే సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించారు సెంథిల్ కుమార్. ఆ తర్వాత సై, ఛత్రపతి, అశోక్, యమదొంగ, అరుంధతి, మగధీర, తకిట తకిట, గోల్కొండ హైస్కూల్, ఈగ, బాహుబలి-1, బాహుబలి-2, విజేత, ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ముఖ్యంగా రాజమౌళి సినిమా అంటే టీమ్ లో సెంథిల్ కుమార్ ఉండాల్సిందే. ప్రొఫెషన్ లైఫ్ లో వరుస విజయాలతో దూసుకెళుతోన్న ఈ స్టార్ సినిమాటోగ్రాఫర్ జీవితంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. గతేడాది ఫిబ్రవరి15న ఆయన భార్య రూహీ యోగి అనారోగ్యంతో కన్నుమూసింది. దీంతో సెంథిల్ కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఈ విషాదం జరిగి ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా తన భార్యన తల్చుకుని ఎమోషనలయ్యారు సెంథిల్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్ ను షేర్ చేసుకున్నారు.
‘నువ్వు లేకుండా ఏడాది గడిచిపోయింది.. నీ నవ్వులు, నీ ప్రేమ లేకుండానే 365 రోజులు గడిచిపోయాయి. ఈ సమయమంతా నీ జ్ఞాపకాలు, కన్నీళ్లతోనే నిండిపోయింది. ఎప్పుడూ నాకేం గుర్తొస్తుంటాయో తెలుసా? నువ్వు నావైపు చూసినప్పుడు నీ నవ్వు, కళ్లలో మెరుపు, నా చేతిలో నువ్వు చేయేసే విధానం.. పదేపదే గుర్తొస్తాయి. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, ఛాంపియన్.. నా సర్వస్వం కూడా! నువ్వు పంచిన ప్రేమ, మనం కలిసి చేసిన పనులు.. అన్నింటినీ జీవితాంతం గుర్తుంచుకుంటాను. రెస్ట్ ఇన్ పీస్ మై డార్లింగ్. నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు. ఎల్లప్పుడూ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’ అని భార్యపై తనకున్న ప్రేమకు అక్షర రూపమిచ్చారు సెంథిల్. ఈ సందర్భంగా రూహితో కలిసి దిగిన పాత ఫోటోను ఈ పోస్ట్కు జత చేశారు.
కాగా రామ్ చరణ్ మగధీర సినిమా షూటింగ్ సమయంలో సెంథిల్, రూహి ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇరు పెద్దల అంగీకారంతో 2009లో పెళ్లి చేసుకున్నారు. రూహి.. యోగా టీచర్. అనుష్క, ప్రభాస్, ఇలియానా వంటి ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలకు ఆమె యోగా శిక్షణ ఇచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.