
ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడూ నడిచే ట్రెండ్ మాత్రం లేడీ ఓరియెంటెడ్ సినిమాలే. కమర్షియల్గా కొన్నిసార్లు ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు సక్సెస్ కాకపోయినా.. దర్శక నిర్మాతలు మాత్రం ఎప్పుడూ హీరోయిన్లపై పెట్టుబడి పెడుతూనే ఉంటారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. పైగా హీరోయిన్స్ కూడా ఎంతసేపూ మేం గ్లామర్ పాత్రలు మాత్రమే చేయాలా.. మేం మాత్రం ఆర్టిస్టులం కాదా అంటూ నటనలో రెచ్చిపోవడానికి రెడీగా ఉంటారు. ఓ వైపు కమర్షియల్ హీరోయిన్గా బిజీగా ఉంటూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ క్వీన్ అనే ట్యాగ్ కోసం తెగ తంటాలు పడుతుంటారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఈ మధ్య తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు డిమాండ్ పెరిగింది.
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల మధ్య ఫైట్ మామూలుగా లేదిప్పుడు. ఒకరిని మించి మరొకరు లేడీ బాస్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. మొన్నటి వరకు అనుష్క, నయనతార లాంటి ఒకరిద్దరు బ్యూటీస్ మాత్రమే ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేవాళ్లు. కానీ ఇప్పుడలా కాదు.. అందరి దారి అదే అయిపోతుంది. అనుష్క శెట్టి గ్యాప్ తీసుకున్నా కూడా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు మాత్రమే చేస్తున్నారు. తాజాగా తెలుగులో ఈమె చేస్తున్న ఘాటీ ఎప్రిల్ 18న విడుదల కానుంది. మరోవైపు నయన్ అయితే పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ కథలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయారు. ఈ లిస్టులోకే సమంత చేరిపోయారు. మొన్న సిటాడెల్ సిరీస్తో అమ్మడి రేంజ్ మరింత పెరిగిపోయింది.
ఓ వైపు యానిమల్, పుష్ప లాంటి సినిమాల్లో పవర్ ఫుల్ పాత్రలు చేస్తూనే.. మరోవైపు ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తున్నారు రష్మిక మందన్న. ఇక కీర్తి సురేష్ సైతం బాలీవుడ్ కోసం గ్లామర్ షో పంచుతూనే.. తనదైన లేడీ ఓరియెంటెడ్ కథలను అస్సలు వదలట్లేదు. ఇక తమన్నా ఓదెల 2 అంటూ వచ్చేస్తున్నారు. వీళ్ళంతా లేడీ ఓరియెంటెడ్ క్వీన్ ముద్ర కోసం ట్రై చేస్తున్నారు. వీళ్ళు మాత్రమే కాదు.. అనుపమ పరమేశ్వరన్ పరదా సినిమాతో వస్తుంది. ఇందులో ఈమె పాత్ర విభిన్నంగా కనిపిస్తుంది. తాజాగా మ్యాడ్ ఫేమ్ అవంతిక సునీల్ కుమార్ హీరోయిన్గా నటిస్తున్న 8 వసంతాలు టీజర్ విడుదలైంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇలా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలే బాగా కనిపిస్తున్నాయిప్పుడు.