
టాలీవుడ్ నటి దక్షీ గుత్తికొండ తన సినీ ప్రయాణం, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో జరిగిన తొలి ఇంట్రడక్షన్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నటి తన తొలి సినిమాను ‘కరోనా వైరస్’ ఆర్జీవీ దర్శకత్వంలో చేయడం విశేషం. సినీ రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత, ఆర్జీవీ గురించి జనంలో ఉన్న భిన్నాభిప్రాయాలు, ముఖ్యంగా అతడు కెమెరా ముందు ప్రవర్తించే తీరు వల్ల ‘ఆర్జీవీ సైకో లేదా పిచ్చోడు’ లాంటి మాటలు విన్నానని దక్షీ గుత్తికొండ తెలిపింది. ఈ కారణాల వల్ల ఆడిషన్ కోసం అతడిని కలవడానికి మొదట భయపడ్డానని ఆమె పేర్కొంది.
అయితే, ఆర్జీవీని దగ్గరగా చూసిన తర్వాత, తన అభిప్రాయం పూర్తిగా మారిందని దక్షీ గుత్తికొండ స్పష్టం చేసింది. ఆర్జీవీ బయట బోల్డ్గా మాట్లాడటం వల్ల ప్రజలు అతడిని అపార్థం చేసుకుంటారని, కానీ అతడు చెప్పే ప్రతి మాట వాస్తవమని ఆమె అభిప్రాయపడింది. ప్రస్తుత సమాజం అతడు చెప్పే కొన్ని వాస్తవాలను అంగీకరించలేకపోవచ్చని తెలిపింది. ఆర్జీవీకి సినిమాలోని ప్రతి క్రాఫ్ట్ గురించి చక్కటి అవగాహన ఉందని.. అతడి దగ్గర పని చేసిన చాలామంది మళ్లీ మళ్లీ తిరిగి వెళ్లడానికి కారణం ఇదేనని చెప్పుకొచ్చింది.
కరోనా వైరస్ చిత్రం తర్వాత ఆమె తన కెరీర్లో నాలుగు సంవత్సరాల గ్యాప్ తీసుకుంది. కరోనా వైరస్ తర్వాత శేఖర్ సూరి ప్రాజెక్ట్, ఆ తర్వాత దూదేకుల పేరుతో ఆహాలో వచ్చిన కొత్తపొరడు టీమ్ చేసిన మరో చిత్రం, ఆపై నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ చిత్రాలలో పలు కీలక పాత్రల్లో పోషించింది. ప్రస్తుతం తాను మరో రెండు ప్రాజెక్టులలో పనిచేస్తున్నానని తెలిపింది. కొత్త నటీనటులకు లేదా చిన్న ప్రొడక్షన్ బ్యానర్లకు సంబంధించిన సినిమాలు విడుదల కావడానికి ఎక్కువ సమయం పడుతుందని, అన్నీ తన చేతుల్లో ఉండవని దక్షీ గుత్తికొండ వివరించింది. తనకు నచ్చిన పాత్రలను, అవకాశాలను వినియోగించుకున్నానని ఆమె తెలిపింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..