
అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా ఇష్టమైన హీరోయిన్స్ లో ఆమని ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు ఆమని. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన ఆమని ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సినిమాలు చేస్తున్నారు ఆమని, సినిమాలతో పాటు సీరియల్స్ లోనూ నటించి మెప్పిస్తున్నారు ఆమని. సినీ నటి ఆమని తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, కుటుంబ బంధాలు, పరిశ్రమలో ఎదుర్కొన్న సవాళ్లు, రెండవ ఇన్నింగ్స్కు దారితీసిన కారణాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వివరించారు. తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆర్థికంగా కష్టాలు వచ్చినప్పుడు,అలాగే తెగనకు ఎదురైనా సందర్భాల్లో తన సోదరుడు, సోదరీమణులు తనకు ఎప్పుడూ తోడుగా నిలిచారని ఆమని తెలిపారు. పిల్లల పెంపకంలో కూడా కుటుంబం అండగా నిలిచిందని, తన సోదరీమణులు “నీ పిల్లల్ని మేము చూసుకుంటాం” అని చెప్పేవారని పేర్కొన్నారు. తాను సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు, పిల్లల పరీక్షల సమయంలో కూడా వారు మద్దతునిచ్చారని తెలిపారు.
సినిమా పట్ల తనకున్న అపారమైన ప్రేమ వల్లే ఈ రంగంలోకి వచ్చానని ఆమని స్పష్టం చేశారు. ఇంట్లో అందరితో ఫైటింగ్ చేసి, “నేను హీరోయిన్ అవుతాను, లేకపోతే చనిపోతాను” అన్నంత ప్యాషన్తో పరిశ్రమలోకి ప్రవేశించానని తెలిపారు. రాధ, శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయశాంతి వంటి నటీమణులు తన రోల్ మోడల్స్ అని, వారి సినిమాలను చూసి హీరోయిన్ అవ్వాలని కలలు కన్నానని ఆమె చెప్పారు. హీరోయిన్ అయితేనే అన్ని రకాల పాత్రలు చేయగలుగుతామని నమ్మేవారట.
పరిశ్రమలో తాను ఎదుర్కొన్న సవాళ్లను ఆమని నిర్మొహమాటంగా పంచుకున్నారు. “దూరపు కొండలు నునుపు” అన్నట్లుగా సినీ ప్రపంచం దూరం నుంచి చూసినంత అందంగా, సులభంగా ఉండదని, దగ్గరికి వచ్చాక కష్టాలు తెలిశాయని వివరించారు. మొదట తమిళ చిత్ర పరిశ్రమలో ప్రయత్నించినప్పుడు, ఫోటోలు చూసి అందంగా ఉందని చెప్పి రప్పించేవారని, కానీ నేరుగా చూసినప్పుడు మాత్రం “ఈ అమ్మాయ్యా?” అన్నట్లుగా ఎక్స్ ప్రెషన్స్ పెట్టేవారు. ప్రధానంగా తన రంగు (కంప్లెక్షన్) తనకు ప్రతికూలంగా మారిందని, తాను నార్త్ ఇండియన్ కలర్ కాదని, దానికి తోడు రిజర్వ్డ్గా ఉండటం వల్ల “మూడీ గర్ల్” అని భావించేవారని ఆమె చెప్పారు.
సావిత్రి, వాణిశ్రీ వంటి తరం నటీమణులు రంగు విషయంలో వివక్షను ఎదుర్కోలేదని, వారి అభినయాన్ని మాత్రమే చూసేవారని ఆమని అన్నారు. అయితే తాను పరిశ్రమకు వచ్చినప్పటికి ట్రెండ్ పూర్తిగా మారిపోయిందని, శ్రీదేవి వంటి తరం నుంచి అందం, స్ట్రక్చర్ వంటివి ప్రాధాన్యత పొందాయని చెప్పారు. నగ్మా, ఖుష్బూ వంటి నార్త్ ఇండియన్ నటీమణులు ఆ సమయంలో తెలుగు స్టార్స్ గా మారిపోయారు. అలాంటి సమయంలో తాను ప్రవేశించానని ఆమని పేర్కొన్నారు. డస్టీ కలర్ అప్పట్లో ఒక మైనస్ పాయింట్గా చూసేవారని, దానిని “బ్లాక్” అని పిలిచేవారని, కానీ ఇప్పుడు దీపికా పదుకొనే వంటి నటీమణుల వల్ల డస్టీ కలర్ ఒక ఫ్యాషన్గా మారిందని, దానికి కొత్త పేర్లు (వీటీష్, డస్కీ) వచ్చాయని ఆమె అన్నారు. హీరోయిన్ అయిన తర్వాత కూడా మేకప్ ద్వారా తన స్కిన్ టోన్ను సమానంగా ఉంచేవారని, ఇందుకోసం చాలా కష్టపడ్డానని తెలిపారు. సెకండ్ ఇన్నింగ్స్కు రావడం వెనుక డబ్బు సంపాదన కారణం కాదని, కేవలం సినిమా పట్ల తనకున్న ప్యాషన్ మాత్రమేనని, సినీ రంగం పట్ల తనకున్న ప్రేమ ఇప్పటికీ చెక్కుచెదరలేదని ఆమని చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి