Prakash Raj: రామ-లక్ష్మణులపై ప్రకాశ్ రాజ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో వైరల్.. భగ్గుమంటోన్న హిందువులు

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ రామాయణం గురించి మాట్లాడుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ప్రకాశ్ రాజ్ పై భగ్గుమంటున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సామాజిక మాధ్యమాల వేదికగా డిమాండ్ చేస్తున్నారు.

Prakash Raj: రామ-లక్ష్మణులపై ప్రకాశ్ రాజ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. వీడియో వైరల్.. భగ్గుమంటోన్న హిందువులు
Prakash Raj

Updated on: Apr 16, 2026 | 9:11 PM

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమాలతో పాటు ఇతర విషయాలతోనూ ఆయన తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. అలాగే బహిరంగ కార్యక్రమాల్లోనూ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా ఆయన మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కేరళ సాహిత్యోత్సవ వేదికపై ప్రకాష్ రాజ్ ప్రసంగిస్తున్నవీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. అందులో ఆయన రామాయణం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వ్యంగ్యంగా విమర్శించడానికి ఆయన రామాయణాన్ని ఉదాహరణగా తీసుకోవడాన్ని చాలా మంది ఖండిస్తున్నారు. ‘శ్రీరామచంద్రుడు, లక్ష్మణులు ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వలస కూలీలని తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు ప్రకాశ్ రాజ్. వారు దక్షిణ భారతదేశంలోని ఒక పొలంలోకి ప్రవేశించి, అక్కడి పండ్లను దొంగిలించి తిన్నారని, ఆ సమయంలో ఆ పొలం యజమాని అయిన రావణుడితో వారికి గొడవ జరిగిందని ఆయన ఎగతాళి చేశాడు. రావణుడు ఒక దక్షిణ భారత గిరిజనుడని, ఆ పండ్ల దొంగతనంపై ప్రశ్నించినప్పుడు అది కాస్తా పెద్ద వివాదంగా మారిందని, ఆఖరికి ఆ గొడవ రూ .2000 జీఎస్టీ బిల్లు చుట్టూ తిరుగుతూ యుద్ధానికి దారితీసిందంటూ ప్రకాశ్ రాజ్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు.

ప్రకాశ్ రాజ్ కామెంట్స్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు, హిందువులు ఈ నటుడిపై భగ్గుమంటున్నారు. ప్రకాశ్ రాజ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ‘హిందువులను అపహాస్యం చేయడానికి ప్రకాష్ రాజ్ రామాయణాన్ని కల్పిత కథగా అల్లి చెప్పారు. కేవలం గోమాంస వినియోగాన్ని ప్రోత్సహించడానికి, ఉత్తర-దక్షిణ రాష్ట్రాల మధ్య అగాథాన్ని సృష్టించడానికే ఈ కామెంట్స్ చేశారు. ఇకపై సినిమాల్లో అతనికి అవకాశాలు ఇవ్వకుండా దర్శక నిర్మాతలు చర్యలు తీసుకోవాలి’ అని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

“నేను ప్రకాష్ రాజ్ నుంచి ఏమీ ఆశించడం లేదు. కానీ ఆ సభలో ఉన్నవాళ్లు ఏం చేస్తున్నారు? ఆయన అసంబద్ధమైన వ్యాఖ్యలకు చప్పట్లు కొడుతూ, ప్రోత్సహిస్తున్నారు. ఎవరూ లేచి నిరసన ఎందుకు తెలపలేదు? అక్కడ హిందువులు ఎవరూ లేరా?” అని మరో నెటిజన్ ప్రశ్నించాడు.

మొత్తానికి తన వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు ప్రకాశ్ రాజ్. ఆ మధ్యన ఆయన తల్లి మరణించినప్పుడు ఆమె అంత్యక్రియలు నిర్వహించిన తీరును చాలా మంది విమర్శించారు. మరి ఈ వివాదంపై ప్రకాశ్ రాజ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ప్రకాశ్ రాజ్ కామెంట్స్ కు సంబంధించిన వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us