
బిడ్డ పుట్టిన ఏడాది వరకు శిశువులకు తల్లి పాలే పట్టించాలని వైద్యులు చెబుతుంటారు. ఏడాది కాకపోయినా కనీసం ఆరు నెలల వరకు అయినా పసి బిడ్డలకు తల్లి పాలే అవసరం. అయితే చాలా మంది తల్లులకు పాలు సరిగా పడవు. దీంతో డబ్బా పాలు లేదా పోత పాలను ఆశ్రయిస్తుంటారు. అయితే ఇలాంటి అవసరం రాకుండా చాలా మంది తల్లులు తమ బిడ్డలకు పట్టగా మిగిలిన పాలను (బ్రెస్ట్మిల్క్)ను దానం చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఒకప్పటి టాలీవుడ్ యాంకర్, బుల్లితెర హీరోయిన్ సమీరా షెరిఫ్ అమ్మగా తన గొప్ప మనసును చాటుకుంది. ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె NICU (నియో నాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్) శిశువుల కోసం 6 లీటర్లకు పైగా తల్లిపాలను భద్రపర్చింది. అది కూడా కేవలం ఒక నెల రోజుల్లోనే. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిందీ అందాల యాంకరమ్మ. ఇప్పుడే కాదు ఇక ముందు కూడా శిశువులకు అత్యంత అవసరమైన బంగారం లాంటి తల్లి పాలను డొనేట్ చేస్తానంటూ
ఒక అందమైన వీడియోను ఇన్స్టాలో షేర్ పంచుకుంది.
‘కేవలం ఒక నెల రోజుల్లోనే అల్లా, నేను, నా బిడ్డ సయ్యద్ అమీర్ ఇది సాధించాం. ఇకముందు కూడా శిశువులకు తల్లి పాలను డొనేట్ చేస్తాం. దీనివలన తల్లులకు ఎలాంటి నష్టం జరగదు. ఇది పెద్ద కష్టమేమీ కాదు. మీ బాడీ మీద, మీమీద, మీ బిడ్డ మీద నమ్మకం ఉంటే చాలు. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండండి, విశ్రాంతి ఎక్కువగా తీసుకోండి. బాగా తినండి. నీళ్లు బాగా తాగండి. బాగా సంతోషంగా ఉండండి. ఎంత ఎక్కువగా పాలు ఇస్తే..అంత ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. కాబట్టి మాతృమూర్తులు భయపడాల్సిన అవసరం లేదు’ అని తల్లులకు భరోసా ఇచ్చింది సమీరా.
ఈ టాలీవుడ్ యాంకరమ్మ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు సినీ, బుల్లితెర ప్రముఖులు, సినీ అభిమానులు, నెటిజన్లు సమీరా షెరీఫ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..