Sushant Singh Rajput: ఏడాది గడుస్తున్నా తేలని సుశాంత్ డెత్ మిస్టరీ.. అతడు ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ పదిలం

Sushant Singh Rajput Death Anniversary: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. ఈ పేరును ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు. 'కైపోచే' సినిమాతో బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసిన సుశాంత్..

Sushant Singh Rajput: ఏడాది గడుస్తున్నా తేలని సుశాంత్ డెత్ మిస్టరీ.. అతడు ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ పదిలం
Sushant Singh Rajput

Updated on: Jun 14, 2021 | 9:03 AM

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. ఈ పేరును ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు. ‘కైపోచే’ సినిమాతో బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసిన సుశాంత్.. ‘ఎం.ఎస్.ధోని’, ‘చిచోరే’, ‘దిల్ బేచారా’ చిత్రాలతో అటు నార్త్ అభిమానులకే కాదు.. ఇటు సౌత్ ఫ్యాన్స్‌కు కూడా ఫేవరెట్ హీరో అయిపోయారు. సైన్స్, స్పేస్ ప్రస్తావన తీసినా, ఇండస్ట్రీలో అణిచివేతకు గురైన హీరో ఎవరైనా ఉన్నారన్నా.. ఫ్యాన్స్‌కు ముందుగా గుర్తొచ్చే పేరు సుశాంత్. అభిమానులందరిని ఒంటరివాళ్లను చేస్తూ ఆయన ఈ లోకాన్ని వదిలివెళ్లి ఇవాళ్టి(జూన్ 14)కి ఏడాది పూర్తయింది. ఇప్పటికీ ఆయన మరణం వీడని మిస్టరీగా మిగిలిపోయింది.

సుశాంత్ మృతి వెనుక రహస్యాన్ని చేధించేందుకు ఐదు ఇన్వెస్టి‌గేటివ్ సంస్థలు రంగంలోకి దిగినా.. ఎవరూ విజయం సాధించలేకపోయారు. 2020 జూన్ 14వ తేదీన ముంబై బాంద్రాలోని తన నివాసంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసును చేధించేందుకు ముంబై పోలిస్, బీహార్ పోలీస్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), ఎంఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలో దిగాయి.

సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని ముంబై పోలీసులు ప్రాధమిక విచారణలో తేల్చగా.. ఈ కేసులో డ్రగ్స్ కోణం బయటపడటంతో ఎన్‌సీబీ అధికారులు సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తితో పాటు కొందరు డ్రగ్ డీలర్స్‌ను అరెస్ట్ చేశారు. అలాగే బీ-టౌన్‌కు కూడా లింకులు ఉన్నాయని తేలడంతో బాలీవుడ్ నటులు దీపికా పదుకొనే, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలి ఖాన్, శ్రద్ధా కపూర్, అర్జున్ కపూర్‌లను కూడా ఎన్‌సీబీ విచారించింది. అయితే, ఈ విచారణ ఫలితాలు లేవి బయటికి రాలేదు. ఇక అరెస్ట్ అయిన నెల రోజులకు రియా బెయిల్‌పై బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.

అటు సీబీఐకి ఈ కేసు అప్పగించి పది నెలలు గడుస్తున్నా.. దర్యాప్తుకు సంబంధించిన పూర్తి విషయాలు ఇప్పటికీ బయటికి రాలేదు. మరోవైపు సుశాంత్ బ్యాంక్ ఖాతా నుంచి రియా చక్రవర్తి బ్యాంకు ఖాతాకు గానీ, ఆమె కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాలకు గానీ డబ్బు బదిలీ కాలేదని ఈడీ అధికారులు స్పష్టం చేశారు. ముంబై పోలీసులు సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని ప్రాధమిక విచారణలో తేల్చగా.. 2020 జులై 27న ఫోరెన్సిక్ ల్యాబరేటరీ కూడా సుశాంత్‌ది హత్య కాదని.. ఆత్మహత్యనేనని పోలీసులకు నివేదికను సమర్పించిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో బీహార్ పోలీసులు జోక్యం చేసుకోవడంతో రాజకీయ రంగు పులుముకుంది. ఇలా ఈ ఐదు సంస్థలు సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్నప్పటికీ.. ఈ కేసు ఓ కొలిక్కి రాలేదు. కాగా, ప్రస్తుతం ఈ కేసు సీబీఐ చేతుల్లో ఉండటంతో.. వారి ప్రకటన కోసం సుశాంత్ అభిమానులతో పాటు యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

Also Read: తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు ఊరట.. ఆ నిబంధనలను వెనక్కి తీసుకున్న ఢిల్లీ సర్కార్..

Loading...
Unable to load recommendations.
Follow Us