ఆ హీరో అద్భుతమైన నటుడు.. సినిమాలు ఫెయిల్ అవ్వొచ్చు కానీ ఆయన ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు..
ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్, ఓ సీనియర్ నటుడితో తన అనుభవాలను పంచుకున్నారు. అలాగే ఆయన అద్భుతమైన పర్ఫెక్షనిస్ట్ అని, సినిమా పట్ల ఆయన అంకితభావం గొప్పదని తెలిపారు. అయితే, ఇటీవల ఆయన మాటతీరుపై వస్తున్న విమర్శలు వ్యక్తిగతమని, వాటిని ఫ్లోలో జరిగిన పొరపాట్లుగా చూడాలని సూచించారు

ఓ ఇంటర్వ్యూలో నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తన సినీ ప్రయాణం గురించి, పలువురు నటీనటులు, దర్శకులతో తన అనుభవాల గురించి విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్, దర్శకుడు త్రినాథరావు నక్కిన, నటి అవికా గోర్ గురించి ఆయన చెప్పిన విషయాలు ఆకట్టుకున్నాయి. రాజేంద్రప్రసాద్ గారితో భూలోకం టు యమలోకం సినిమాకు పనిచేసిన అనుభవాలను వేణుగోపాల్ గుర్తుచేసుకున్నారు. రాజేంద్రప్రసాద్ ఒక లెజెండరీ నటుడని, ఆయన అంకితభావం అద్భుతమని కొనియాడారు. మార్నింగ్ 5 గంటలకే వచ్చి, మేకప్ వేసుకుని, ఉదయం 7 గంటలకు ఎంత సిన్సియర్గా పనిచేసేవారో వివరించారు. “సినిమాలు ఫెయిల్ అవ్వచ్చు, రాజేంద్రప్రసాద్ గారు ఫెయిల్ అవ్వకూడదు” అని ఆయన తనతో చెప్పిన మాటను గుర్తు చేసుకున్నారు. అయితే..
ఇటీవల రాజేంద్రప్రసాద్ గారి మాటతీరు, అక్కడక్కడ టంగ్ స్లిప్ అవ్వడం వంటి వాటిపై వస్తున్న విమర్శలను ప్రస్తావించినప్పుడు, అవి వ్యక్తిగతమని, ఫ్లోలో జరిగే పొరపాట్లు కావచ్చని, వాటిని ఉద్దేశపూర్వకంగా చేసినవిగా చూడకూడదని బెక్కెం వేణుగోపాల్ అన్నారు. భూలోకం టు యమలోకం సినిమాకు వచ్చిన ఆర్థిక నష్టం రాజేంద్రప్రసాద్ వివాదాల వల్ల కాదని, మార్కెట్ పరిస్థితులు, శాటిలైట్ హక్కుల పడిపోవడం వల్లేనని స్పష్టం చేశారు. అయితే, సినిమా థియేటర్లలో బాగా ఆడిందని, పెద్దగా నష్టాలు రాలేదని, కేవలం 20శాతం వరకు మాత్రమే ప్రభావం ఉండిందని పేర్కొన్నారు.
మేం వయసుకు వచ్చాం సినిమాతో దర్శకుడు త్రినాథరావు నక్కినతో తనకున్న అనుబంధాన్ని, ఆయన కష్టాన్ని బెక్కెం వేణుగోపాల్ వివరించారు. త్రినాథరావుకు నెలకి కేవలం రూ.10,000 జీతం ఇస్తూ రెండన్నరేళ్ళు పనిచేయించుకున్నానని, ఆయన ఆర్థిక కష్టాలను, ప్రాబ్లమ్స్ను ఎదుర్కొంటూ కథను పట్టుదలతో అభివృద్ధి చేశారని తెలిపారు. లక్ష్మణ్ అనే తన స్నేహితుడు ద్వారా త్రినాథరావు తనకు పరిచయం అయ్యారని చెప్పారు. మొదట త్రినాథరావుతో బ్రహ్మాయణ సెంటిపిల్ బ్రహ్మలోకం వంటి కథలు చర్చించినా, అవి ఫైనల్ అవ్వలేదన్నారు. ఒక లవ్ స్టోరీ చేయమని భాస్కరభట్ల సూచించారని, తర్వాత గోవాలో కూర్చొని త్రినాథరావు చెప్పిన ఒక హిందూ-ముస్లిం ప్రేమకథ ఆలోచన నుంచి మేం వయసుకు వచ్చాం పుట్టిందని చెప్పారు. స్క్రిప్ట్ పూర్తవ్వడానికి ఎనిమిది నెలలు, సినిమా మొదలుపెట్టడానికి 15 నెలలు, రిలీజ్కి రెండన్నరేళ్ళు పట్టిందని వేణుగోపాల్ వివరించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
