
‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన హీరోయిన్ నిధి అగర్వాల్. ఆ మూవీ తర్వాత ఈ ముద్దు గుమ్మ చేసిన సినిమాలు అంతగా హిట్ కాలేకపోయాయి. గతేడాది పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో వచ్చి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో నటించింది నిధి. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నిధి టాలీవుడ్లో వరుస ఆఫర్లను అందుకుంటుంది. ప్రస్తుతం నిధి పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్గా నటించనున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజమేనంటూ.. తాజాగా నిధి క్లారిటీ ఇచ్చింది.
ఇటీవల ఓ నెషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిధి మాట్లాడుతూ.. “అవును నేను పవన్ కళ్యాణ్తో ఓ సినిమా చేస్తున్నాను. ఆ ప్రాజెక్టులో భాగమవడం నాకు కలలా అనిపిస్తోంది. ఇది నాకు తొమ్మిదవ సినిమా. నా కెరీర్లోనే బంగారు సినిమా అవుతుంది. పవన్ సర్తో కలిసి పనిచేయడం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న” అంటూ చెప్పుకొచ్చింది. పవన్, క్రిష్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా గాసిప్స్ వినిపించాయి. భారీ బడ్జెట్ పీరియడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అలాగే ఈ మూవీకి హరిహర వీరమల్లు అనే టైటిల్ అనుకుంటున్నట్లుగా టాక్. ఈ సినిమాను ఎ.ఎం రత్నం నిర్మిస్తున్నారు.