
సిరీస్ రివ్యూ: జగమే సంగీతం
నటీనటులు: ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, మధుబాల, అక్షయ్ లగుసాని, సుశ్మిత శెట్టి తదితరులు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
స్క్రీన్ రైటర్: పల్నాటి సూర్యప్రతాప్, వంగుల సూర్య మనోజ్, శ్రావణి సముద్రాల
దర్శకుడు: పల్నాటి సూర్యప్రతాప్
డ్యూరెషన్: 8 ఎపిసోడ్స్ (Amazon Prime)
సంగీత నేపథ్యం అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది విశ్వనాథ్ గారి సినిమాలే.. ఆ తర్వాత చిరంజీవి నటించిన రుద్రవీణ కూడా ఉంటుంది. అదే కోవలో ఇప్పుడు ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో వచ్చిన వెబ్ సిరీస్ జగమే సంగీతం. సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ తెరకెక్కించిన ఈ సిరీస్ ఎలా ఉందో చూద్దాం..
కథ:
ఈ వెబ్ సిరీస్ ప్రధానంగా పాతకాలపు సంప్రదాయాలకు, నేటి ఆధునిక కాలపు ట్రెండ్కు మధ్య జరిగే పోరాటాన్ని సంగీత నేపథ్యంలో చెబుతుంది. గోదావరి తీరంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న కర్ణాటక సంగీత దిగ్గజం శాస్త్రి (ప్రకాష్ రాజ్). తన వారసత్వాన్ని నిలబెట్టే బాధ్యతను తన మనవడు బాలు (అక్షయ్ లగుసాని)కి అప్పగించి, అతనికి కఠినమైన శిక్షణ ఇస్తుంటాడు. కళను అమ్ముకుని డబ్బు సంపాదించాలనే ఆలోచనను శాస్త్రి తీవ్రంగా అసహ్యించుకుంటాడు. ఇలాంటి నిష్టతో పెరిగిన బాలు జీవితంలోకి మోడ్రన్ పాప్ సింగర్ పల్లవి (సుష్మిత శెట్టి) వస్తుంది. ఆమెతో ప్రేమలో పడిన బాలు.. ఒకవైపు తాతయ్య విధించిన కఠిన నియమాలకు, మరోవైపు తాను ఇష్టపడ్డ అమ్మాయి కోసం మోడ్రన్ సంగీతానికి మధ్య ఎలా నలిగిపోయాడు? అదే సమయంలో శాస్త్రి గారి శాస్త్రీయ సంగీతాన్ని సవాల్ చేసే విధంగా త్యాగరాజు (శ్రీకాంత్) సంగీతం ప్రపంచంలో దూసుకుపోతుంటాడు. ఈ క్రమంలో త్యాగరాజు నుంచి శాస్త్రికి ఓ సవాల్ ఎదురువుతుంది. ఇంతకీ త్యాగరాజు.. శాస్త్రికి ఎలాంటి విసిరాడు. మరి తాత గౌరవాన్ని నిలబెట్టడానికి మనవడు ఏం చేసాడు.. ఈ క్రమంలో వాళ్ల కుటుంబంలో ఏళ్లుగా దాగి ఉన్న షాకింగ్ నిజాలు ఎలా బయటపడ్డాయి..? అనేది మిగిలిన కథ.
కథనం:
అమెజాన్ ప్రైమ్లో విశేషంగా ఆకట్టుకున్న హిందీ ఒరిజినల్ ‘బందిష్ బాండిట్స్’కు ఇది తెలుగు రీమేక్. అక్కడి హిందుస్థానీ సంగీతం స్థానంలో ఇక్కడ కర్ణాటక సంగీతాన్ని ఎంచుకున్నారు. అలాగే రాజస్థాన్ కల్చర్కు బదులు గోదావరి నేటివిటీని తీసుకుని చాలా చక్కని మార్పులు చేశారు. అయితే కథను తెలుగుకు తగ్గట్టుగా మార్చుకోవడంలో ఉన్న శ్రద్ధ, దాన్ని ఎమోషనల్గా కనెక్ట్ చేయడంలో కాస్త స్లోగా నడిచింది. మాతృకకు 100 శాతం న్యాయం చేయాలని ప్రయత్నించారు.. ఈ క్రమంలో చాలా వరకు ఎంగేజింగ్గానే తీసారు. ముఖ్యంగా ఎపిసోడ్ల సంఖ్యను తగ్గించేయడం వల్ల, పాత్రల మధ్య భావోద్వేగాలు పండటానికి కాస్త సమయం దొరకలేదు కానీ ఉన్నంతలో బాగానే వేగంగా వెళ్లేలా ప్లాన్ చేసుకున్నారు. డైలాగులు బాగానే రాసుకున్నారు.. ముఖ్యంగా ఈ సిరీస్లో చెప్పాలనుకున్న పాయింట్స్ చాలా ఉన్నాయి. చాందసవాద కుటుంబాల్లో ఆడవాళ్ల ప్రతిభను, వాళ్ల సంగీతాన్ని మగవాళ్లు ఎలా అణిచివేస్తారనే సున్నితమైన అంశాన్ని తీసుకున్నా, దానిని బలంగా తెరపై ప్రెజెంట్ చేసారు. రెండు మూడు ఎపిసోడ్స్ తర్వాత స్క్రీన్ప్లే కాస్త నెమ్మదిగా వెళ్లింది. సంగీతం ఇష్టపడే వాళ్లకు మాత్రం ఈ సిరీస్ బాగానే నచ్చుతుంది. సొంతంగా ఒక వాయిద్యాన్ని కనిపెట్టి దాని కోసం కష్టపడే తమ్ముడి ట్రాక్ కానీ, అవమానం ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడే హీరో కాబోయే భార్య క్యారెక్టర్ కానీ.. ఇలాంటి మంచి ఉపకథలు ఇందులో ఉన్నాయి. కాకపోతే ఎమోషనల్ డెప్త్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ఉన్నంతలో మెప్పించడానికి ప్రయత్నించారు.
నటీనటులు:
సంగీతానికి ప్రాణమిచ్చే తాతయ్య క్యారెక్టర్లో ప్రకాష్ రాజ్ తనదైన అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సిరీస్కు బలాన్నిచ్చింది. ఇక బాలు పాత్రలో నటించిన అక్షయ్ లగుసాని, పల్లవి పాత్రలో సుష్మిత శెట్టి తమ పరిధి మేరకు బాగానే నటించారు. హీరో పాత్రను మరింత లోతుగా డిజైన్ చేయాల్సి ఉంది. త్యాగరాజు పాత్రలో ఈ సిరీస్కు ప్రాణంగా నిలిచాడు. ఇక కథలో అత్యంత కీలకమైన సరస్వతి పాత్రలో సీనియర్ నటి మధుబాల కనిపించారు. ఆమె క్యారెక్టర్ను చాలా ఎపిసోడ్ల పాటు సైలెంట్గా ఉంచి, చివర్లో ఒకేసారి రివీల్ చేయడం వల్ల ఆ పాత్రకు రావాల్సినంత ఎలివేషన్ రాలేదు. మిగిలిన వాళ్లంతా తమ తమ పాత్రలతో మెప్పించారు.
టెక్నికల్ టీం:
ఈ సిరీస్లో ప్రధానంగా మెచ్చుకోవాల్సింది సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ వర్క్ గురించే. కర్ణాటక సంగీతానికి, పాప్ మ్యూజిక్కు సంబంధించిన పాటలు, నేపథ్య సంగీతం చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. విజువల్స్ పరంగా సినిమాటోగ్రఫీ బాగుంది. గోదావరి లొకేషన్లను చాలా అందంగా చూపించారు. కానీ ఎడిటింగ్ విభాగం కాస్త నెమ్మదించింది. రచయితలు పాత్రలను తీర్చిదిద్దిన విధానంలోనూ కన్ఫ్యూజన్ కాస్త ఉంది. దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ మంచి సిరీస్నే అందించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
పంచ్ లైన్:
ఓవరాల్గా జగమే సంగీతం.. మంచి కథతో వచ్చిన మ్యూజికల్ సిరీస్..!