
రానున్న సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద టాప్ హీరోలైన మహేష్, బన్నీ పోరుకు సిద్ధమయ్యారు. మహేష్ నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’.. బన్నీ నటిస్తోన్న ‘అల వైకుంఠపురంలో’ చిత్రాలు రెండూ జనవరి 12న రిలీజ్ డేట్ను ఫిక్స్ చేసుకున్నాయి. దీంతో ఈ సంక్రాంతికి గట్టి పోటీ ఉండబోతుందని అందరూ భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం రిలీజ్ డేట్ విషయంలో ఈ ఇద్దరు కాంప్రమైజ్ అయినట్లు తెలుస్తోంది. ఒకే రోజు కాకుండా రెండు వేర్వేరు తేదీల్లో వచ్చేందుకు వీరు అంగీకరించారట. ఈ మేరకు సీక్రెట్గా మీట్ అయిన ఈ ఇద్దరు నిర్ణయం తీసుకున్నట్లు ఫిలింనగర్లో టాక్ వినిపిస్తోంది.
అయితే మొదట సంక్రాంతికి విడుదల తేదీని మహేష్ బాబు ఫిక్స్ చేసుకున్నాడు. సరిలేరు నీకెవ్వరు ప్రారంభమైన రోజే వచ్చే సంక్రాంతికి మూవీ రానుందని అధికారిక ప్రకటన ఇచ్చేశారు. ఇక ఆ తరువాత బన్నీ టీమ్ తమ విడుదల తేదీని ప్రకటించింది. దీంతో అప్పటినుంచే ఈ రెండు సినిమాల మధ్య పోరు మొదలైంది. కాగా ఈ విషయంలో కాస్త వెనక్కి తగ్గాలని ఇరు మూవీల నిర్మాతలు ఎప్పుడో భావించారట. లేకపోతే కలెక్షన్లపై భారీ ప్రభావం ఉంటుందని వారు అనుకున్నారట. కానీ ఈ విషయంపై మహేష్, బన్నీలు మాత్రం వెనక్కి తగ్గలేదట. ఆ రోజు ఎలాగైనా రావాల్సిందేనని పట్టు పట్టారట. దీంతో నిర్మాతలు రంగంలోకి దిగి ఇద్దరిని బుజ్జగించడంతో.. సీక్రెట్గా మీట్ అయిన మహేష్, బన్నీలు రిలీజ్ డేట్లపై కాంప్రమైజ్ అయినట్లు తెలుస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఒక సినిమాను 11న, మరో సినిమాను 13న రిలీజ్ చేయాలని నిర్మాతలు అనుకుంటున్నట్లు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే.. ఎవరి సినిమా ముందు వస్తుందో చూడాలి.
కాగా మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో మహేష్ సరసన రష్మిక నటించింది. విజయశాంతి, ప్రకాష్ రాజ్, సంగీత, బ్రహ్మానందం, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీ సంగీతం అందిస్తున్నాడు. అలాగే బన్నీ నటిస్తోన్న అల వైకుంఠపురంలోకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. టబు, జయరామ్, నివేథా పేతురాజ్, నవదీప్, సుశాంత్, సునీల్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.