
సినిమా అంటేనే ట్రెండ్. ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఒకప్పుడు బాలీవుడ్కు పరిమితమైన స్పెషల్ సాంగ్స్ ట్రెండ్ కొన్నేళ్ల క్రితం టాలీవుడ్లో మొదలైంది. స్టార్ సినిమా హీరో నుంచి చిన్న హీరో వరకు దాదాపు ప్రతి సినిమాలోనూ స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే. దానికి థియేటర్లలో అభిమానులు స్టెప్పులు వేయాల్సిందే.
ఇదివరకు స్పెషల్ సాంగ్స్ చేయడానికి ముంబై భామలను తీసుకొచ్చేవారు మన దర్శక నిర్మాతలు. తర్వాత కాస్త ట్రెండ్ బడ్జెట్ ఎక్కువగా పెట్టే అవకాశం ఉంటే బాలీవుడ్ నుంచి తీసుకొచ్చి స్టెప్పులు వేయించేవారు. అనంతరం మరింత సాహసం చేసి హాలీవుడ్ నుంచి కూడా భామలను తీసుకొచ్చి మన స్టార్ల పక్కన ఐటమ్ సాంగ్స్ చేయించారు.
అయితే, కొన్నేళ్లుగా మన సినిమాల ట్రెండ్ బాగా మారిపోయింది. హీరోయిన్లతో ఐటమ్ సాంగ్స్ చేయించడం మొదలుపెట్టారు.
ఒకప్పుడు సీనియర్ హీరోయిన్లతో ఐటమ్ నంబర్స్ చేయించిన మన దర్శకులు ఇప్పుడు సినిమాల్లో ఇంకా నటిస్తున్న హీరోయిన్లతోనే సాంగ్స్ చేయిస్తూ అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, శ్రియా శరణ్, సమంత, అనుష్క, తమన్నా కూడా స్టార్ హీరోల సినిమాల్లోనే కాకుండా చిన్న సినిమాల్లో కూడా స్పెషల్ సాంగ్స్కు ఆడిపాడారు. చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో స్పెషల్ సాంగ్లో నర్తించేందుకు మిల్కీ బ్యూటీ తమన్నా రెడీగా ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా వరుస అవకాశాలు దక్కించుకుంటున్న యంగ్ హీరోయిన్ శ్రీలీల కూడా ఐటమ్ సాంగ్ చేసి అభిమానులను ఉర్రూతలూగించింది.
సీనియర్ హీరోయిన్ శ్రియ.. ఒకవైపు తల్లి పాత్రలు చేస్తూనే ఐటమ్ నంబర్స్లో కూడా నటిస్తోంది. నాన్ వయొలెన్స్ అనే సినిమాలో ‘కనకం’ అనే ఐటమ్ సాంగ్లో ఆడిపాడింది. తాజాగా విడుదలైన ఈ లిరికల్ వీడియోలో శ్రియ అందాలను ఆరబోసిందని నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు.
డీజే టిల్లు సినిమాతో యూత్లో క్రేజ్ తెచ్చుకున్న నేహా శెట్టి.. పవన్ కల్యాణ్, సుజీత్ కాంబినేషన్లో వచ్చిన ‘ఓజీ’లోని ఐటమ్ నెంబర్లో ఆడిపాడింది. టిల్లు సినిమాలోని క్యారెక్టర్, అందంతో యూత్లో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్న నేహాశెట్టి స్పెషల్ సాంగ్లో నర్తించి క్రేజ్ను మరింత పెంచుకోవాలని ఆరాటపడుతోంది.
రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పటికే కిసిక్ అంటూ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చి సూపర్ హిట్ అయిన పుష్ప 2లో ఐటమ్ సాంగ్ చేసి స్క్రీన్ను షేక్ చేసిన విషయం తెలిసిందే.
సినిమాల్లో హీరోయిన్లుగా నటిస్తూనే క్రేజ్ మరింత పెంచుకునేందుకు ఐటమ్ సాంగ్స్లోనూ నటించేస్తున్నారు. సమంత, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, తమన్నా కూడా తమ కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే స్పెషల్ సాంగ్స్లో నర్తించి మెప్పించారు. అదే ట్రెండ్ ను ఫాలో అవుతూ క్రేజ్తోపాటు భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు నేటి హీరోయిన్లు. అందం ఉన్నప్పుడే డబ్బు కూడబెట్టుకోవాలనే ఫార్ములాను ఫాలో అయిపోతున్నారు.