
96 సినిమాతో తమిళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది గౌరీ కిషన్. అలాగే జాను మూవీతో తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యింది. ఇప్పుడు ఆమె హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా గౌరీ కిషన్… అదర్స్ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నిర్వహించిన ప్రెస్మీట్లో ఓ రిపోర్టర్ ఆమె గురించి కామెంట్లు చేశారు. హీరోతో పోలిస్తే హీరోయిన్ చాలా పొట్టిగా, లావుగా ఉందంటూ ప్రశ్నించాడు. ఆమె బరువు ఎంత అని అడగడమే కాదు మిస్ కాస్టింగ్ జరిగిందంటూ కామెంట్ చేయడంతో గౌరీ ఆగ్రహంతో ఊగిపోయారు. బాడీషేమింగ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. రిపోర్టర్ ప్రశ్నలకు ధీటుగానే బదులిచ్చింది గౌరీ. దీంతో ప్రెస్ మీట్ లో గందరగోళం నెలకొంది.
తాజాగా రిపోర్టర్తో గొడవపై స్పందించింది నటి గౌరీ కిషన్.. ఆయన కావాలనే తనపై కామెంట్లు చేశారన్నారు. ఆయన ప్రవర్తన రౌడీయిజంలా అనిపించిందని చెప్పారు. ఓ అమ్మాయి ఇలాంటి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం ఎంత కష్టమో తెలుసా అని ప్రశ్నించారు. నటి గౌరీకి అండగా నిలిచారు సింగర్ చిన్మయి. రిపోర్టర్తో పోరాడిన తీరు చాలా నచ్చిందన్నారు. ఇలాంటి ప్రశ్నలు హీరోలను అడగడానికి చేతకాదు కాని.. హీరోయిన్లనే ఎందుకు అడుగుతారని ప్రశ్నించారు చిన్మయి.
ఈ విషయంలో తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు గౌరీ కిషన్. తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ప్రకటన విడుదల చేశారు. “కళాకారులు, మీడియా మధ్య ఎలాంటి సంబంధాన్ని పెంపొందించుకోవాలనుకుంటున్నామో.. మనమందరం కలిసి ఆలోచించవచ్చు. విమర్శలు సైతం అందులో భాగమేనని నాకు అర్థమయ్యింది. కానీ ప్రత్యేక్షంగా గానీ.. పరోక్షంగా ఒకరి శరీరం లేదా, రూపాన్ని లక్ష్యంగా చేసుకునే వ్యాఖ్యలు, ప్రశ్నలు ఏ సందర్భంలో వచ్చినా తప్పే. నేను నటించిన సినిమా గురించి ప్రశ్నలు అడిగి ఉంటే బాగుండేది. ఒక హీరోను అదే విధంగా ప్రశ్నలు అడుగుతారా.. ? క్లిష్ట పరిస్థితిలో నేను నా అభిప్రాయాన్ని నిలబెట్టుకున్నందుకు నేను గర్వపడుతున్నాను. ఇది నాకు మాత్రమే కాదు, ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్న ఎవరికైనా ముఖ్యం. మన అసౌకర్యాన్ని వ్యక్తపరచడానికి, మనం తప్పు చేస్తే ప్రశ్నించడానికి మనకు అనుమతి ఉంది” అంటూ ప్రకటనలో తెలిపారు.
ఇవి కూడా చదవండి : Actress: ఒకప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. క్రేజ్ మాములుగా ఉండదు..