By-Poll Results: ఉప ఎన్నికలంటేనే అధికార పార్టీలదే హవా.. అందుకు రెండే కారణాలు.. ఏంటంటే?

|

May 02, 2021 | 5:58 PM

ఉప ఎన్నికలంటే అధికార పార్టీలేనా? ఇకపై ఇదే ట్రెండా? ఈ ప్రశ్నలకు గత రెండు దశాబ్ధాలుగా జరిగిన పలు ఉప ఎన్నికల ఫలితాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. తాజాగా తిరుపతి లోక్‌సభకు, నాగార్జున సాగర్ అసెంబ్లీ సీటుకు...

By-Poll Results: ఉప ఎన్నికలంటేనే అధికార పార్టీలదే హవా.. అందుకు రెండే కారణాలు.. ఏంటంటే?
Follow us on

By-Poll Results always ruling party favour: ఉప ఎన్నికలంటే అధికార పార్టీలేనా? ఇకపై ఇదే ట్రెండా? ఈ ప్రశ్నలకు గత రెండు దశాబ్ధాలుగా జరిగిన పలు ఉప ఎన్నికల ఫలితాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. తాజాగా తిరుపతి లోక్‌సభ (TIRUPATI LOKSABHA CONSTITUENCY)కు, నాగార్జున సాగర్ అసెంబ్లీ (NAGARJUNSAGAR ASSEMBLY) సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీలే విజయ పతాకాన్ని ఎగురవేశాయి. తిరుపతి లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికలో ఏపీ (AP)లో అధికార పార్టీ వైసీపీ (YCP) తరపున బరిలోకి దిగిన డాక్టర్ గురుమూర్తి (DR GURUMURTY) ఘన విజయం సాధించారు. ఇటు తెలంగాణ (TELANGANA)లో జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికలోను ఇక్కడి అధికార పార్టీ టీఆర్ఎస్ (TRS) అభ్యర్థి నోముల భగత్ (NOMULA BHAGATH) విజయం సాధించారు. అయితే.. కాంగ్రెస్ (CONGRESS) కురు వృద్ధ నేత జానారెడ్డి (JANAREDDY)పై ఆయన పదిహేను వేల ఓట్ల మెజారిటీ మాత్రమే సాధించడంతో ఇక్కడ అధికార పార్టీ గెలుపును నల్లేరు మీద నడకతో పోల్చలేం. కానీ ఎప్పుడు, ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా దాదాపు అధికార పార్టీలే విజయం సాధిస్తున్నాయి. ఒక్క దుబ్బాక (DUBBAKA) అసెంబ్లీ సీటుకు జరిగిన ఉప ఎన్నిక ఫలితం మాత్రమే అధికార పార్టీకి షాకిచ్చింది ఈ మధ్య కాలంలో. అక్కడ సెంటిమెంటు, అధికార పార్టీ పాల్పడిన కొన్ని తప్పిదాలు బీజేపీ అభ్యర్థి (BJP CANDIDATE) రఘునందన్ రావు విజయానికి దోహదపడ్డాయి.

గతంలోను ఏదైనా అసెంబ్లీ, లోక్‌సభ సీటులో సిట్టింగ్ ఎమ్మెల్యే లేదా ఎంపీ మరణిస్తే దివంగత ప్రజాప్రతినిధి వారసున్ని నిలబెడితే.. ఏకగ్రీవానికి మిగిలిన పార్టీలు సహకరించిన పరిస్థితి కొన్ని సార్లు కనిపించింది. ఆ తర్వాత ఈ సఖ్యత రాజకీయ పార్టీల మధ్య కొరవడింది. రాజకీయ ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వరాదన్న కసి రాజకీయాలు మొదలైన తర్వాత ఏ ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యే పరిస్థితి లేదు. తాజాగా తిరుపతి లోక్‌సభ సీటు నుంచి 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ రావు (BALLI DURGAPRASAD RAO) గత సంవత్సరం (2020) కరోనా వైరస్ (CORONA VIRUS) సోకి చెన్నై (CHENNAI) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆ తర్వాత పరిణామాలలో దుర్గా ప్రసాద్ తనయునికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS JAGAN) తిరుపతి లోక్‌సభ సీటుకు జరిగిన ఉప ఎన్నికలో డాక్టర్ గురుమూర్తికి అవకాశం కల్పించారు. ఆయనపై టీడీపీ తరపున మాజీ మంత్రి పనబాక లక్ష్మి (PANABAKA LAXMI), బీజేపీ తరపున కర్నాటక మాజీ సీఎస్ రత్నప్రభ (RATNAPRABHA), కాంగ్రెస్ పార్టీ తరపున చింతా మోహన్ (CHINTHA MOHAN) పోటీ చేయగా.. ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దాంతో అధికార వైసీపీ అభ్యర్థి గురుమూర్తి భారీ మెజారిటీతో విజయం సాధించారు.

ఇటు తెలంగాణలో నాగార్జునసాగర్ అసెంబ్లీ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయం సాధించింది. 18 వేల 872 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ మొత్తం పోలైన ఓట్లలో 89 వేల 804 ఓట్లు పొందగా.. కాంగ్రెస్ అభ్యర్థి కే.జానారెడ్డి 70 వేల 932 ఓట్లు, బీజేపీ అభ్యర్థి 7,676 ఓట్లు సాధించారు. అయితే.. అధికార పార్టీ ఘనంగా విజయం సాధించలేదనే చెప్పాలి. సాగర్‌లో వార్ వన్ సైడ్ అని చెప్పలేం. ఓ రకంగా చెప్పాలంటే ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించే అధికార పార్టీ.. సాగర్‌లో బొటాబొటీ మెజారిటీతో గెలిచిందనే చెప్పాలి. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులే గెలవడానికి పలుకారణాలు కనిపిస్తాయి. అందులో ఒకటి అధికార పార్టీ సర్వ శక్తులు ఒడ్డి, ఉద్ధండులను పార్టీ ప్రచారంలోకి దింపి మరీ ఉప ఎన్నికలను ఎదుర్కోవడమే.. దానికి తోడు అధికార పార్టీ అభ్యర్థే గెలిస్తే.. నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుండడం కూడా ఓ కారణం. అయితే.. ప్రజా వ్యతిరేకత ఎక్కువైతే మాత్రం ఫలితం అధికార పార్టీకి వ్యతిరేకంగా వస్తుందన్న వాస్తవం దుబ్బాక లాంటి చోట్ల నిరూపితమైంది.

గతంలో పేరున్న నేతలు మరణిస్తే వారు ప్రాతినిధ్యం వహిస్తున్న సీట్ల నుంచి వారి కుటుంబీకులకే ఛాన్సిచ్చేవారు. ముఖ్యమంత్రి హోదాలో పర్యటనకు వెళుతూ హెలికాప్టర్ కూలిన దుర్ఘటనలో మరణించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS RAJASHEKHAR REDDY) ప్రాతినిధ్యం వహించిన పులివెందుల నుంచి వైఎస్ విజయమ్మ (YS VIJAYAMMA) 2009 డిసెంబర్ నెలలో జరిగిన ఉప ఎన్నికలో ఏక్రగీవంగా ఎన్నికయ్యారు. అంతకు ముందు 2007లో ఖైరతాబాద్ శాసనసభ్యునిగా వుండి గుండెపోటుతో హఠాన్మరణం పాలైన పీ.జనార్ధన్ రెడ్డి (PJR) స్థానంలో ఆయన తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేయగా.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీకి దిగలేదు. కానీ ఈ ఏకగ్రీవాలను విశ్వసించని లోక్‌సత్తా పార్టీ (LOK SATTA PARTY) పోటీకి దిగింది. అయితేనేం విష్ణువర్ధన్ రెడ్డి భారీ ఆధిక్యంతో ఘనవిజయం సాధించారు. ఇలాంటి ఉదంతాలు గత రెండు దశాబ్దాలలో ఎన్నో వున్నాయి. ఒకటి అధికార పార్టీ తరపున నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తే తమ నియోజకవర్గం అభివృద్ది చెందుతున్న విశ్వాసం, రెండోది.. అధికార పార్టీలు తమ అంగ, అర్ధ బలాలను పూర్తి స్థాయిలో ఫణంగా పెట్టడం… ఈ రెండు కారణాలే ఉప ఎన్నికల్లో ఎక్కువ శాతం అధికార పార్టీలు విజయం సాధించేందుకు దోహదపడుతున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ALSO READ: సుదీర్ఘ నిరీక్షణకు తెర… 14 ఏళ్ళ ప్రాయంలో కన్న కల.. 68 ఏళ్ళ వయసులో తీరుతోంది!

ALSO READ: బెదిరింపులా..? బిజినెస్ విస్తరణ వ్యూహమా? అదర్ పూనావాలా లండన్ మకాం వెనుక మర్మమిదే!

ALSO READ: అఫ్ఘనిస్తాన్ నుంచి నాటో దళాల ఉపసంహరణ షురూ.. సెప్టెంబర్ 11 డెడ్‌లైన్