
Assam Assembly Election 2021: దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో పశ్చిమ బెంగాల్, అసోంలో తొలి విడత పోలింగ్ శనివారం కొనసాగింది. అసోంలో మూడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తుండగా, నిన్న తొలి విడత పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు బరిలో నిలిచాయి. అయితే సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ తమ ఆస్తుల విలువలను ఎన్నికల సంఘానికి అందజేస్తుంటారు. అభ్యర్తులు ఆస్తులు, భూములు, వ్యాపారాలు, కుటుంబ సభ్యులపై ఉన్న ఆస్తులు తదితర వివరాలు ఎన్నికల అపిడవిట్లో ప్రకటిస్తుంటారు. అయితే అసోంలో పోటీ చేసే ఈ అభ్యర్థిపై ఉన్న ఆస్తుల విలువ చూస్తే ఆశ్యర్యపోతుంటారు. తాజాగా ఈ అభ్యర్థి గురించే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.
యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యుపీపీఎల్) అభ్యర్థి మనోరంజన్ బ్రహ్మ బరిలో ఉండగా, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన గురించే చర్చ కొనసాగుతోంది. అసోం ఎన్నికల బరిలో ఉన్న బ్రహ్మ అత్యంత ధనవంతుడు. ఆయన ఆస్తుల విలువ రూ.268 కోట్లని ప్రకటించారు. అంతేకాదు ఆయన వద్ద 429 కార్లు, బైక్ లు కూడా ఉన్నాయి.
మనరంజన్ బ్రహ్మ అస్సాంలోని కొక్రాజార్ (పశ్చిమ) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. తన ఎన్నికల అఫిడవిట్లో 268 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఆయన వద్ద 429 వాహనాలు, 20 బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. బ్రహ్మకు రూ . రూ .11 కోట్ల విలువైన స్థిరస్తులున్నాయి. అలాగే ఆయన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయనకు 78 కోట్ల రూపాయల అప్పు కూడా ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో తనకు రూ .57 కోట్ల ఆదాయం వచ్చిందని బ్రహ్మ స్పష్టం చేశారు. అలాగే ఆయన భార్య, పిల్లల పేరుపై కూడా ఆస్తులున్నట్లు ప్రకటించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మనరంజన్ మరియు అతని భార్య మొత్తం ఆదాయం రూ. 56 కోట్లు.
కాగా, మనరంజన్కు వ్యాపారంలో మంచి లాభాలున్నాయి. 43 సంవత్సరాలున్న బ్రహ్మ ప్రధానంగా వివిధ వ్యాపారాలలో పాల్గొంటుంటాడు. నిర్మాణ పనులు అతని ప్రధాన ఆదాయ వనరు. 20 సంవత్సరాల వయసులోనే వివిధ వ్యాపారాలలో అడుగు పెట్టాడు. క్రమ క్రమంగా వ్యాపారాలలో భారీగా సంపాదించుకున్నాడు. ఆయన వ్యాపారాలు అసోం మరియు ఈశాన్య భారతంలో విస్తరించి ఉన్నాయి. మరోవైపు అతనికి వ్యవసాయం కూడా ఉంది. వ్యవసాయానికి సంబంధించిన పనులను తన భార్య చూసుకుంటుందని ఆయన చెప్పుకొచ్చాడు.
ఎన్నికల సంఘం ప్రకారం బ్రహ్మపై రెండు కేసులు నమోదై ఉన్నాయి. మోసం మరియు ఆస్తి నేరాలు సెక్షన్ 403 కింద నమోదు చేయబడ్డాయి.
అస్సాంలో 126 సీట్లకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి దశలో 47 స్థానాలకు పోలింగ్ జరిగింది. రెండవ దశలో 39 స్థానాలకు ఓటింగ్ ఏప్రిల్ 1 న, మూడవ దశ ఏప్రిల్ 6 న 40 సీట్లకు ఓటింగ్ జరుగనుంది.