Andhra Pradesh: షుగర్ కంపెనీలో పేలుడు.. ఇద్దరు దుర్మరణం.. రూ.కోటి పరిహారానికి డిమాండ్

| Edited By: Ravi Kiran

Aug 20, 2022 | 3:57 PM

కాకినాడ (Kakinada) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గ్రామీణం మండలంలోని వాకలపూడి పారిశ్రామికవాడలోని ఓ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ప్యారీ షుగర్స్‌ రిఫైనరీలో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో 9..

Andhra Pradesh: షుగర్ కంపెనీలో పేలుడు.. ఇద్దరు దుర్మరణం.. రూ.కోటి పరిహారానికి డిమాండ్
Fire (file)
Follow us on

కాకినాడ (Kakinada) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గ్రామీణం మండలంలోని వాకలపూడి పారిశ్రామికవాడలోని ఓ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ప్యారీ షుగర్స్‌ రిఫైనరీలో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గోదాంలో చక్కెర బస్తాలు లోడ్ చేస్తున్న సమయంలో కన్వేయర్‌ బెల్టుకు విద్యుత్ సరఫరా చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మృతులను వీరవెంకట సత్యనారాయణ, వీరమళ్ల రాజేశ్వరరావుగా గుర్తించారు. గాయపడిన వారిలో బండి వీరవెంకట రమణ పరిస్థితి విషమంగా ఉంది. వైద్య చికిత్స కోసం అతడిని కాకినాడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన 8 మంది కాకినాడలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కాగా.. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలని కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో స్థానికంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. యాజమాన్యంతో చర్చలు జరిపే ఏర్పాటు చేస్తామని పోలీసులు సర్దిచెప్పడంతో. కార్మికులు, ప్రజాసంఘాలు శాంతించారు.

ప్రమాద స్థలాన్ని మాజీ మంత్రి కన్నబాబు, ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పరిశీలించారు. ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు పరిశ్రమ నుంచి పరిహారం వచ్చేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రాథమిక నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం

ఇవి కూడా చదవండి