Smuggler Bhaskaran Arrested: తమిళనాడు బడా స్మగ్లర్, ఎర్ర చందనం దుంగల అక్రమదారు స్మగ్లర్ భాస్కరన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా భాస్కరన్ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. కొన్ని రోజులుగా తమిళనాడులో మకాం వేసిన పోలీసులు సరిహద్దుల్లోని చిత్తూరు జిల్లా పుత్తూరు వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నట్లు కడప పోలీసులు వెల్లడించారు.
కాగా భాస్కరన్ తన అనుచరుల చేత శేషాచలం అడవుల్లో ఎర్రచందనం నరికించి తమిళనాడు, కర్ణాటక మీదుగా విదేశాలకు ఎగుమతి చేస్తుంటాడు. అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్గా 2016 నుంచి అతడిపై 21 కేసులు నమోదయ్యాయి. అతడిచ్చిన సమాచారంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మరో 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి దగ్గరి నుంచి కోటి విలువైన ఎర్రచందనం దుంగలు, 290 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఓ తుపాకీ, బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే భాస్కరన్ ఏ అండ లేకుండా ఇంత పెద్ద ఇల్లీగల్ బిజినెస్ చేయడని పోలీసులు భావిస్తున్నారు. ఇతడి వెనుక తమిళనాడుకి చెందిన బడా రాజకీయ నాయకులు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పోలీసులు కూడా ఆ కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. త్వరలోనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.