Smuggling: చిత్తూరు నల్లమల అడవుల్లో ఎర్రచందనం డంప్ కలకలం.. టాస్క్ ఫోర్స్ అధికారులను చూసి 50 మంది స్మగ్లర్లు పరార్..
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పరిధిలోని నల్లమల అడవీ ప్రాంతంలో మరోసారి ఎర్రచందనం స్మగ్లింగ్ కలకలం రేగింది. చంద్రగిరి మండలంలోని శ్రీనివాసమంగాపురం సమీపంలో..
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పరిధిలోని నల్లమల అడవీ ప్రాంతంలో మరోసారి ఎర్రచందనం స్మగ్లింగ్ కలకలం రేగింది. చంద్రగిరి మండలంలోని శ్రీనివాసమంగాపురం సమీపంలో ఎర్రచందనం దుంగలకు సంబంధించిన భారీ డంప్ను టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు. 49 ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే టాస్క్ ఫోర్స్ అధికారుల రాకను పసిగట్టిన సుమారు 50 మంది స్మగర్లు అక్కడి నుంచి పరార్ అయ్యారు. విషయం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని ఎర్రచందనం దుంగల డంప్ను పరిశీలించారు. దీనికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎస్పీ ఆంజనేయులు.. లాక్డౌన్ తరువాత స్మగ్లర్లు రెచ్చిపోతున్నారని అన్నారు. స్మగ్లర్లకు స్థానికులు కూడా సహకరిస్తున్నట్లు సమాచారం అందిందని చెప్పారు. స్మగ్లర్లకు షెల్టర్ ఇస్తున్న వారిపై నిఘా పెట్టామని ఎస్పీ తెలిపారు. స్మగ్లర్లకు షెల్టర్ ఇవ్వొద్దని వార్నింగ్ ఇచ్చిన ఎస్పీ.. ఒకవేళ ఎవరైనా షెల్టర్ ఇచ్చినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, ఎర్రచందనం స్మగ్లింగ్ను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టేందుకు ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ఫోర్స్ అధికారులు ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు.