Baby Girl: గుంటూరు జిల్లలో దారుణం.. ఏడు నెలల పసికందుపై పైశాచికత్వం.. పెదవులు, మర్మావయవాలపై గాయాలు..!

|

Jul 21, 2021 | 12:28 PM

తల్లి ఒడిలో హాయిగా నిద్రపోయిన చిన్నారి తెల్లారేసరికి ముళ్లపొదల్లో అపస్మారక స్థితిలో పడి ఉంది. చిన్నారి పెదాలు, మర్మావయవాల వద్ద తీవ్ర గాయాలున్నాయి.

Baby Girl: గుంటూరు జిల్లలో దారుణం.. ఏడు నెలల పసికందుపై పైశాచికత్వం.. పెదవులు, మర్మావయవాలపై గాయాలు..!
8 Month Old Baby
Follow us on

Seven month old baby Girl molested: తల్లి ఒడిలో హాయిగా నిద్రపోయిన చిన్నారి తెల్లారేసరికి ముళ్లపొదల్లో అపస్మారక స్థితిలో పడి ఉంది. చిన్నారి పెదాలు, మర్మావయవాల వద్ద తీవ్ర గాయాలున్నాయి. దీంతో పసికందుపై అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని బోదనంపాడులో మంగళవారం ఈ దారుణ ఘటన వెలుగుచూసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని బోదనంపాడులో మంగళవారం ఈ సంఘటన జరిగింది. కుటుంబసభ్యలు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి ఇంటి ఆవరణలో 7 నెలల పసికందును ఊయలలో నిద్రపుచ్చి పక్కనే తల్లి నిద్రపోయింది. తెల్లవారే సరికి లేచి చూస్తే పాప కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురైన తల్లి కుటుంబసభ్యులతో కలిసి పాప కోసం చుట్టుపక్కల గాలించింది. ఊరంతా వెతికి పిల్ల జాడ కనిపించకపోవడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది.

అయితే, మంగళవారం తెల్లవారు జామున వారి ఇంటికి కొద్ది దూరంలో నిర్మానుష్య ప్రాంతంలో పాప అపస్మారక స్థితిలో పడి ఉందని, స్థానికులు చెప్పడంతో అక్కడకు వెళ్లి చూస్తే తన బిడ్డేనని గుర్తించింది. చిన్నారి ఒంటిపైనున్న గాయాలు చూసి ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది. కుటుంబసభ్యులు హుటాహుటిన మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పాప పెదాలు, మర్మావయాలపై గాయాలున్నట్లు వైద్యులు గుర్తించారు. అక్కడ ప్రాథమిక చికిత్స నిర్వహించి మెరుగైన వైద్య సదుపాయం నిమిత్తం గుంటూరు జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ దారుణానికి సంబంధించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గ్రామంలో పలువురు అనుమానితులను ప్రశ్నించారు. వైద్యాధికారుల నుంచి నివేదిక వచ్చాకే పాపపై అఘాయిత్యం జరిగిందా? లేదా? అన్నది తేలుతుందని పోలీసులు తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు చెప్పారు.

మరోవైపు తమ కుటుంబంపై కక్ష పెంచుకున్నవారే ఈ అఘాయిత్యానికి పాల్పడ ఉంటారని చిన్నారి తల్లి పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేసింది. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న పసికందును జిల్లా జాయింట్ కలెక్టర్‌ ప్రశాంతి పరామర్శించారు. చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఏడు నెలల పాపపై జరిగిన ఈ అఘాయిత్యం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.

Read Also… Mangli Bonalu Song: బోనాల సాంగ్ వివాదంపై తొలిసారి స్పందించిన సింగర్ మంగ్లీ.. ఆమె మాటల్లోనే..