Hyderabad: కడుపున పుట్టినవాళ్లే ఆస్తి కోసం వేధించారు.. కన్నీళ్లతో బ్రతకలేక.. తనువు చాలించారు

|

Aug 18, 2021 | 5:09 PM

కనీసం కని-పెంచారనే కనికరం లేదు. కడుపులో పడింది మొదలు-పెద్దయ్యేవరకు బరువు బాధ్యతలు మోశారనే మాటే మర్చిపోయారు. భార్యలు రాగానే...

Hyderabad: కడుపున పుట్టినవాళ్లే ఆస్తి కోసం వేధించారు.. కన్నీళ్లతో బ్రతకలేక.. తనువు చాలించారు
Parents Suicide
Follow us on

కనీసం కని-పెంచారనే కనికరం లేదు. కడుపులో పడింది మొదలు-పెద్దయ్యేవరకు బరువు బాధ్యతలు మోశారనే మాటే మర్చిపోయారు. భార్యలు రాగానే ఇన్నాళ్లు మంచిచెడ్డలు చూసినవారు భారమైపోయారు.  వృద్ధాప్యంలో ఉన్నారు-కాటికెళ్లేవరకు కంటికి రెప్పలా చూసుకోవాలన్న బాధ్యతను వదిలేశారు.. చివరి రోజుల్లో ఒక ముద్ద అన్నం పెట్టాలన్న ఇంగిత జానం లేకుండా ప్రవర్తించారు. పెళ్లాల మోజులో సైకోలుగా మారిన కొడుకులు-కనిపెంచిన తల్లిదండ్రులనే కాటికి పంపేశారు. హైదరాబాద్ లో జరిగిన ఈ అమానుష ఘటన… తల్లీబిడ్డలు, తండ్రీకొడుకుల సంబంధాలకే మాయని మచ్చలా మిగిలింది.

ఏ తల్లిదండ్రులైనా చివరి రోజుల్లో ఏం కోరుకుంటారు. తాము అల్లారుముద్దుగా పెంచి పెద్దచేసిన పిల్లల నుంచి కొంచెం ప్రేమ… ఓ చిన్న ముద్ద… ఇదే కదా వాళ్లు ఆశించేది. ఇంతకంటే ఎక్కువ ఆశించే తల్లిదండ్రులు ఎవ్వరూ ఉండరు. ఎన్ని ఆస్తిపాస్తులున్నా… మణిమాణిక్యాలున్నా… ఇంకేమున్నా… సొంత బిడ్డల నుంచి ఆదరణ, ప్రేమ దక్కకపోతే… ఏ తల్లిదండ్రులైనా ఏం చేస్తారు? కుమిలికుమిలి ఏడుస్తారు. తమ పరిస్థితిని తలుచుకుని అల్లాడిపోతారు? ఎందుకీ బతుకంటూ ఆవేదనకు గురవుతారు. కన్నబిడ్డలే ఆదరించకపోతే ఇంకెవరి కోసం బతకాలనే ఆలోచనకు వస్తారు. హైదరాబాద్ వనస్థలిపురంలో ఓ వృద్ధ దంపతులు ఇలాగే కుమిలిపోయారు. ఇద్దరు కొడుకుల్ని కని, పెంచి, పెద్దచేసి, ప్రయోజకులుగా తీర్చిదిద్ది, కోట్ల రూపాయల ఆస్తిపాస్తులను అప్పగిస్తే, చివరికి తామే భారం అయ్యామే అంటూ ఆవేదనకు గురయ్యారు. తీవ్ర మనస్తాపం చెందారు. ఇంకా బతుకుండి ఏం లాభం అనుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన ఈ ఘటన స్థానికులను కలిచివేసింది.

హైదరాబాద్ వనస్థలిపురంలో ఉండే మోహన్ రెడ్డి, అనంతలక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు. మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించి పెళ్లిళ్లు చేశారు. ఇద్దరికీ కోట్ల రూపాయల విలువైన ఆస్తిపాస్తులను ఇచ్చారు. పన్నెండెకరాల భూమిని సమానంగా పంచి ఇచ్చారు. అయినా, కొడుకుల ఆశ తీరలేదు. మోహన్ రెడ్డి, అనంతలక్ష్మి ఉంటున్న ఇంటిపై వాళ్ల కన్ను పడింది. ఆ ఇంటికి కూడా అమ్మేసుకుని వాటాలు పంచేసుకోవాలనుకున్నారు. అంతే, తల్లిదండ్రులను టార్చర్ పెట్టడం మొదలుపెట్టారు. దాంతో, తాము చచ్చాక మీకే వస్తుంది, అప్పటివరకు ఆగండి అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు తల్లిదండ్రులు. అయినా, మాట వినని కొడుకులు… కనిపెంచిన తల్లిదండ్రులకే అన్నం పెట్టడం మానేశారు. వృద్ధాప్యంలో ఉన్నారనే కనికరం లేకుండా పని చేయిస్తూ కసాయిల్లా ప్రవర్తించేవారు. చివరికి, ఇంటి కోసం కేసులు కూడా పెట్టి వేధించారు. పెన్షన్ డబ్బులను కూడా లాక్కునేవారు. దాంతో, విసిగిపోయిన మోహన్ రెడ్డి, అనంతలక్ష్మి దంపతులు… ఫ్యాన్ కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.

Also Read: అంజనమ్మ రాకతో అల్యూమినియం ఫ్యాక్టరీలో వెల్లివిరిసిన ఆనందాలు.. చిరు, పవన్ ఫుల్ హ్యాపీ

మొదట ‘అయ్యా’ అంటూ దొంగ బాబా కాళ్లు మొక్కారు.. తర్వాత ‘నీ అయ్య’ అంటూ బెండుతీశారు