Mob attacks traffic police: పోలీసు తనిఖీలు చేస్తుండగా, బైకిస్టు దుర్మరణం.. ట్రాఫిక్ పోలీసులను చితబాదిన స్థానికులు
Mob in Mysuru attacks traffic cop: కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్వాసులకు కోపం వచ్చింది. విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసును చితకబాదారు.

కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్వాసులకు కోపం వచ్చింది. విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసును చితకబాదారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బైకిస్టు జారి పడి మరణించడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల ఓవరాక్షన్ వల్లే యువకుడు చనిపోయాడంటూ.. కోపం వచ్చిన స్థానికులు ట్రాఫిక్ పోలీసులను చితక్కొట్టారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మైసూరు నగరం బోగాది రింగ్ రోడ్డుపై దేవరాజ్ బైక్ నడుపుతుండగా సురేష్ అనే వ్యక్తి వెనుక కూర్చున్నాడు. అదే మార్గంలో పోలీసులు వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. పోలీసులు చెయ్యెత్తి ఆపమనడంతో బైక్పై ఉన్న ఇద్దరు అదుపు తప్పి కింద పడిపోయారు. దీంతో దేవరాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలను కోల్పోయాడు.
ఈ వార్త దావాలనంలా వ్యాపించడంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ధర్నాకు దిగారు. పోలీసులు డబ్బుల కోసం ఎప్పుడంటే అప్పుడు తనిఖీలు చేస్తూ ప్రజలను ప్రమాదాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. దీంతో స్థానికులకు సర్ధి చెప్పే క్రమంలో పోలీసులకు జనానికి మధ్య వాగ్వివాదం ముదిరింది. కొందరు వ్యక్తులు ఏఎస్సైలు స్వామినాయక్, మాదేగౌడ, కానిస్టేబుల్ మంజులపై దాడి చేశారు. అక్కడే ఉన్న ఓ పోలీస్ జీపును తలకిందులు చేశారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులు భక్షకులుగా మారి ఇలాంటి అమాయకపు ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని ఆరోపించారు.
ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. బైక్ను టిప్పర్ ఢీకొనడం వల్లనే ప్రమాదం జరిగిందని, తమ తప్పేం లేదని చెప్పారు. బైక్ ప్రమాదంలో గాయపడిన సురేష్ తాము పొలీసులకు సుమారు 250 మీటర్ల దూరంలో ఉన్నామని, వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ తమ బైకును డీకొట్టిందని, కిందపడిన తరువాత ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పాడు. ఇదిలావుంటే, దాడికి గురైన పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.