
థమ్సప్, కోకాకోలా కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం.. వాటి అమ్మకాలపై నిషేధం విధించాలంటూ పిటిషన్ వేసిన వ్యక్తికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. పిటిషనర్ చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేశాడంటూ రూ.5 లక్షల జరిమానా విధించింది. తాను సామాజిక కార్యకర్తనని పేర్కొన్న ఉమెద్సిన్హా చావ్డా అనే వ్యక్తి థమ్సప్, కోకాకోలాల సేల్స్ బ్యాన్ చేయాలంటూ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయమూర్తులు జస్టిస్ చంద్రచూడ్, హేమంత్ గుప్తా, అజయ్ రాస్తోగిలతో కూడిన బెంచ్..విచారణ జరిపింది.
అయితే, తన పిటిషన్లో ప్రత్యేకించి రెండు ప్రముఖ బ్రాండ్స్నే ఎందుకు ఎంచుకున్నారనే విషయంపై స్పష్టతనివ్వడంలో విఫలమయ్యారని కోర్టు పేర్కొంది. ఆ డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరం అని నిరూపించలేకపోయారంటూ పిటిషన్ ను కొట్టివేసింది. పిటిషనర్ ఈ విషయంపై సాంకేతిక పరిజ్ఞానం లేకుండా వ్యాజ్యం దాఖలు చేసినట్లు కోర్టు పేర్కొంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం పరిధిని మించి, చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేశారని ఆగ్రహించిన బెంచ్ రూ. 5 లక్షల జరిమానా కట్టాలని పిటిషనర్ ను ఆదేశించింది. నెల రోజుల్లోగా జరిమానా మొత్తాన్ని కోర్టు రిజిస్ట్రీలో జమ చేయాలని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డు అసోసియేషన్ కు పంపించాలని చావ్డాను సుప్రీం కోర్టు ఆదేశించింది.