Man stabs wife: ఇంట్లోకి రానివ్వడం లేదని.. భర్త భార్యపై కక్ష పెంచుకున్నాడు.. ఎలాగైనా ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని.. ప్రణాళిక రచించాడు. చివరకు ఆమె డ్యూటీ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా.. నడిరోడ్డపై అందరూ చూస్తుండగానే ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ముఖం, చేతులపై కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన మహిళ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తీరా దాడి చేసింది ఆ మహిళ భర్తేనని పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి మహారాష్ట్రలోని నాగ్పూర్ పట్టణంలో చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నాగ్పూర్ నగరంలోగల అజ్ని గ్రౌండ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగ్పూర్కు చెందిన నర్సు బబిత దూబే (40), సంతోష్ కాలే ఇద్దరూ భార్యభర్తలు.. మొదటి భర్తతో విడిపోయిన బబిత సంతోష్ కాలేను రెండో పెళ్లి చేసుకోని జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో సంతోష్ కాలే నిత్యం మద్యం తాగి వచ్చి బబితను తీవ్రంగా వేధిస్తున్నాడు. దీంతో వారం రోజుల క్రితం భార్యభర్తలిద్దరూ గొడవపడ్డారు. తనను కొట్టడంతో బబిత సంతోష్ను ఇంట్లోంచి బయటకు గెంటేసింది. అప్పటినుంచి ఇంట్లోకి భర్తను రాకుండా అడ్డుకుంటోంది.
దీంతో బబితపై కోపం పెంచుకున్న సంతోష్.. మంగళవారం రాత్రి ఆమె ఆసుపత్రి నుంచి వస్తుండగా.. దారికాచి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే తన వెంట తెచ్చుకున్న కత్తితో నర్సు ముఖంపైన, చేతులపైన విచక్షణా రహితంగా దాడి చేశాడు. వెంటనే స్థానికులు అప్రమత్తమై అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన బబితను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలికి చికిత్స అందుతోంది. కాగా.. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: