Kerala Models Mishap case: మాజీ మిస్‌ కేరళ మృతి కేసులో మరో ట్విస్ట్.. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి సంచలనాలు!

|

Nov 23, 2021 | 9:27 PM

మాజీ మిస్‌ కేరళ అన్సీ కబీర్‌ , రన్నరప్‌ అంజనా నిజంగా రోడ్డు ప్రమాదంలో చనిపోయారా ? లేక వేరే కుట్ర ఉందా ? అన్న విషయం పెద్ద మిస్టరీగా మారింది.

Kerala Models Mishap case: మాజీ మిస్‌ కేరళ మృతి కేసులో మరో ట్విస్ట్.. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి సంచలనాలు!
Former Miss Kerala Ansi Kabeer Anjana Shajan
Follow us on

Miss Kerala Mishap case: మాజీ మిస్‌ కేరళ అన్సీ కబీర్‌ , రన్నరప్‌ అంజనా నిజంగా రోడ్డు ప్రమాదంలో చనిపోయారా ? లేక వేరే కుట్ర ఉందా ? అన్న విషయం పెద్ద మిస్టరీగా మారింది. రోడ్డు ప్రమాదం వెనుక డ్రగ్‌ మాఫియా కుట్ర ఉన్నట్టు సంచలన విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి.

మాజీ మిస్​ కేరళ అన్సీ కబీర్, రన్నరప్​ అంజనా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు వెలుగు లోకి వస్తున్నాయి. నవంబర్‌ 1న కేరళలోని కొచ్చి సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయం బయటపడింది. అన్సీ, అంజనా ప్రయాణిస్తున్న కారు ను మరో కారు వెంబడించిందని, దాన్నుంచి తప్పించుకునే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. అన్సీ కబీర్‌, అంజనా కారును వెంబడించింది డ్రగ్ మాఫియా గ్యాంగ్‌స్టర్ సైజు థంకచ్చన్ అని పోలీసులు గుర్తించారు.

బైక్‌ను తప్పించే ప్రయత్నంలో అన్సీ కబీర్‌, అంజనా ప్రయాణం చేస్తున్న కారు చెట్టును ఢీకొట్టినట్టు తొలుత ప్రచారం జరిగింది. కానీ, డ్రగ్‌ మాఫియా డాన్‌ థంకచ్చన్‌ నుంచి తప్పించుకునే ప్రయత్నం లోనే వీళ్ల కారు ప్రమాదానికి గురైనట్టు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదంలో అన్సీ కబీర్‌, అంజనాలు అక్కడిక్కడే మృతి చెందారు. అయితే, ప్రమాదానికి ముందు ఇద్దరు కూడా ఫోర్ట్‌ కొచ్చి ప్రాంతంలో ఉన్న హై ఎండ్‌ హోటల్‌ నంబర్‌ 18లో ఓ పార్టీ హాజరైనట్లు పోలీసులు తెలిపారు.

హోటల్‌లో పార్టీ ముగిసిన తర్వాత ఇద్దరు మోడల్స్‌ ఇంటికి వెళ్తుండగా.. పార్టీకి వచ్చిన కొందరు అతిథులు కారులో వారిని వెంబడించారు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌లో ఆడి కారు మోడల్స్‌ని ఫాలో అయినట్లు పోలీసులు గుర్తించారు. ఆడి కారు డ్రైవ్‌ చేసిన వ్యక్తి సైజు థంక్‌చన్‌ అని.. అతడికి కొచ్చిలోని డ్రగ్‌ పెడ్లర్స్‌తో సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. బెంగళూరు నుంచి కొచ్చికి మాదక ద్రవ్యాలు తెచ్చే గ్రూప్‌ కోసం సైజు పని చేసే వాడని పోలీసులు తెలిపారు.

అయితే, హోటల్‌లో విందు ముగిసిన తరువాత తనతో రావాల్సిందిగా సైజు ఇద్దరు మోడల్స్‌ని ఆహ్వానించాడని తెలుస్తోంది. కానీ, అన్సీ కబీర్‌ , అంజనా అందుకు అంగీకరించలేదు. హోటల్‌ నుంచి బయటకు వచ్చిన తరువాత ఇద్దరిని సైజు ఫాలో అయ్యాడు. ఈ క్రమంలో ప్రమాదం జరిగి అంజనా, అన్సీ మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే పార్టీ జరిగిన హోటల్‌ యజమాని రాయ్ వాయలత్‌తో పాటు కొందరిని ప్రశ్నించారు. హోటల్‌లో అంజనా, అన్సీ పాల్గొన్న పార్టీ సీసీటీవీ ఫుటేజ్‌ మాయం కావడం పలు అనుమానాలు తావిస్తోంది. కొచ్చి సమీపం లోని చెరువులో సీసీటీవీ హార్డ్‌డిస్క్‌ను పడేసినట్టు హోటల్‌ సిబ్బంది పోలీసులకు తెలిపారు. దీంతో చెరువులో హార్డ్‌డిస్క్‌ కోసం పోలీసులు గాలించారు. స్కూబా డైవర్స్‌ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

మరోవైపు సైజు థంకచ్చన్ కోసం కేరళ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. థంకచ్చన్ కు కొచ్చిలో మాదకద్రవ్యాల సరఫరాదారులతో సంబంధాలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, తనకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని సైజు థంకచ్చన్‌ ముందస్తు బెయిల్ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు కేరళ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Read Also…  Biryani Free Offer: భోజన ప్రియులకు బంపర్ ఆఫర్.. కేజీ టమాటో ఇస్తే కేజీ బిర్యానీ ఫ్రీ.. ఇదెక్కడో తెలుసా..!