బైక్ దొంగిలించాడని.. చావబాది చంపారు

| Edited By:

Jun 24, 2019 | 12:55 PM

కేవలం బైక్ దొంగతనం చేశాడన్న ఆరోపణలపై ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని తీసింది ఓ గుంపు. ఈ అమానుష ఘటన ఝార్ఖండ్‌లోని మూడు జిల్లాల సరిహద్దుల్లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా.. ఈ ఘటనపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఖర్సావాన్ జిల్లాలకు చెందిన శామ్స్ తాబ్రెజ్(24) అనే యువకుడు పూణేలో పని చేస్తున్నాడు. రంజాన్ కోసం సొంత గ్రామానికి వచ్చిన అతడు.. పెళ్లి సంబంధం కుదరడంతో […]

బైక్ దొంగిలించాడని.. చావబాది చంపారు
Follow us on

కేవలం బైక్ దొంగతనం చేశాడన్న ఆరోపణలపై ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని తీసింది ఓ గుంపు. ఈ అమానుష ఘటన ఝార్ఖండ్‌లోని మూడు జిల్లాల సరిహద్దుల్లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా.. ఈ ఘటనపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఖర్సావాన్ జిల్లాలకు చెందిన శామ్స్ తాబ్రెజ్(24) అనే యువకుడు పూణేలో పని చేస్తున్నాడు. రంజాన్ కోసం సొంత గ్రామానికి వచ్చిన అతడు.. పెళ్లి సంబంధం కుదరడంతో అప్పటి నుంచి ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఈ క్రమంలో జూన్ 18న రాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులతో కలిసి జంషెడ్‌పూర్‌కు బయల్దేరాడు. వీరిని దొంగలని అనుమానించిన స్థానికులు దాడికి యత్నించగా.. మధ్యలో తాబ్రెజ్‌తో ఉన్న ఇద్దరు తప్పించుకొని పారిపోయారు. కాని వారికి తాబ్రెజ్ దొంగగా దొరికిపోయాడు.

అంతే.. అతడిపై ఓ మూక విరుచుకుపడింది. కర్రలతో దాదాపు 7గంటలకు పైగా అతడిని చితకొట్టారు. అంతేకాదు ‘జై శ్రీ రామ్’, ‘జై హనుమాన్’ నినాదాలు చేయాలంటూ బలవంత పెట్టారు. తనను విడిచిపెట్టాలంటూ అతడు ఎంత ప్రాధేయపడ్డా.. వారి మనసు కరగలేదు. బాధితుడిని కాపాడేందుకు స్థానికులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో కొన్ని గంటల తరువాత అతడు సృహ తప్పి పడిపోయాడు.

ఇక ఆ తరువాత అతడిని పోలీసులకు పట్టించిన ఆ మూక.. తాబ్రెజ్‌పై కేసును నమోదు చేయించింది. అయితే అప్పటికే తాబ్రెజ్‌కు తీవ్రగాయాలవ్వడంతో స్థానికంగా ప్రాథమిక చికిత్స చేయించిన పోలీసులు అతడిని సెరైకేలా జిల్లా జైలుకు తరలించారు. కానీ అక్కడ అతడి పరిస్థితి క్షీణించడంతో వెంటనే జిల్లాలో ఉన్న సదర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స తీసుకుంటూ తాబ్రెజ్ శనివారం కన్నుమూశాడు.

ఇదిలా ఉంటే పోలీసుల నిర్లక్ష్యంతోనే తమ కుమారుడు మరణించాడని తాబ్రెజ్ కుటుంబసభ్యులు అంటున్నారు. జైలులో ఉన్న తాబ్రెజ్‌ను చూసేందుకు వెళ్లిన సోదరుడి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించారని.. లాఠీ చార్జ్ చేసి, అతడిని కూడా జైలులో పెట్టారని వారు అంటున్నారు. తమ కుమారుడు ఎలాంటి నేరం చేయకపోయినా.. అన్యాయంగా అతడి ప్రాణం తీసుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఆ మూక పట్ల, పోలీసుల పట్ల చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.