అనుమానాస్పద స్థితిలో గర్భిణీ మృతి..40 రోజుల తర్వాత పోస్టుమార్టం
8 నెలల గర్భిణీ చనిపోయిన 40 రోజుల తర్వాత ఆమె మృతదేహన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు పోలీసులు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చిత్తూరు జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. 8 నెలల గర్భిణీ చనిపోయిన 40 రోజుల తర్వాత ఆమె మృతదేహన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు పోలీసులు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని మదనపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. మృతురాలి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
చిత్తూరు జిల్లాలోని గుర్రంకొండ మండలం రామాపురానికి చెందిన యువతికి, యర్రబల్లి గ్రామానికి చెందిన యువకుడితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా, వీరికి ఓ కూతురు పుట్టింది. ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భిణి. కాగా, మే 27న ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే, ఆకస్మత్తుగా ఆమెకు ఫిట్స్ రావటంతో చనిపోయిందని మృతురాలి భర్త, అత్తామామలు అందరిని నమ్మించారని వారు ఆరోపించారు. ఇటీవల తమ మనవరాలిని చూసేందుకు అల్లుడి ఇంటికి వెళ్లగా తమను ఇంట్లోకి రానివ్వలేదని వాపోయారు. ఈ క్రమంలోనే జరిగిన వాగ్వాదంలో తమ బిడ్డను తానే చంపినట్లు అల్లుడు నోరు జారాడని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురిని అల్లుడే చంపి ఫిట్స్తో చనిపోయినట్లు అందరినీ నమ్మించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు.




