HCA Scam: హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు కస్టడీ కోరనున్న సీఐడీ… ఈడీ రాసిన లేఖపై కూడా నిర్ణయం తీసుకోనున్న సీఐడీ

హైదరాబాద్ క్రికెట్‌ అసోసియేషన్‌లో అవకతవకల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌ రావును కస్టడీ కోరనుంది సీఐడీ. నిధుల దుర్వినియోగం వ్యవహారంలో జగన్‌తో పాటు మరికొంత మంది నిందితులను విచారించనుంది సీఐడీ. ఈడీ రాసిన లేఖపై కూడా నిర్ణయం...

HCA Scam: హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు కస్టడీ కోరనున్న సీఐడీ... ఈడీ రాసిన లేఖపై కూడా నిర్ణయం తీసుకోనున్న సీఐడీ
HCA ED

Updated on: Jul 12, 2025 | 10:22 AM

హైదరాబాద్ క్రికెట్‌ అసోసియేషన్‌లో అవకతవకల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌ రావును కస్టడీ కోరనుంది సీఐడీ. నిధుల దుర్వినియోగం వ్యవహారంలో జగన్‌తో పాటు మరికొంత మంది నిందితులను విచారించనుంది సీఐడీ. ఈడీ రాసిన లేఖపై కూడా నిర్ణయం తీసుకోనుంది సీఐడీ. ఈ క్రమంలో హెచ్‌సీఏ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈడీ నెక్స్ట్ యాక్షన్ ప్లానేంటి? అనే అంశం ఇప్పుడు క్రికెట్‌ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

హైదరాబాద్ క్రికెట్‌ అసోసియేషన్‌లో అవకతవకలపై ఈడీ విచారణ మొదలుపెట్టింది. ప్రాథమిక సమాచారం ఇవ్వాలని సీఐడీకి ఇప్పటికే లేఖ రాసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. – ఇప్పటికే ఈడీ దగ్గర హెచ్‌సీఏకు చెందిన రెండు కేసులు ఉన్నాయి. జగన్ మోహన్ రావు వ్యవహారంతోపాటు..బీసీసీఐ నిధుల దుర్వినియోగంపై ఈడీ విచారణ సాగుతోంది. కోట్ల రూపాయల నిధుల గల్లంతు, కాంట్రాక్ట్‌ ఇచ్చిన వ్యవహారంపై విచారణ చేయనుంది ఈడీ. ఈ క్రమంలో ఇవాళ ECIR నమోదు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

HCA అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేందుకు జగన్మోహన్‌రావు నిబంధనలు తుంగలో తొక్కారని స్వయంగా సీఐడీనే చెబుతోంది. ఇందుకోసం గౌలిపురా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న మాజీమంత్రి కృష్ణయాదవ్, మరికొందరి సంతకాలను ఫోర్జరీ చేశారు జగన్‌మోహన్‌రావు. కృష్ణయాదవ్‌కు ఏమాత్రం తెలియకుండానే గౌలిపురా క్రికెట్ అసోసియేషన్ పేరును శ్రీచక్ర క్రికెట్ క్లబ్‌గా మార్చేశారు. ఇది కూడా విచారణలోనే బయటపడింది. అలా మార్చిన కొత్త క్లబ్‌కు కవితను అధ్యక్షురాలిగా, రాజేందర్ యదవ్‌ను ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆ తరువాత జగన్మోహన్‌రావు స్వయంగా ఆ క్లబ్‌లో సభ్యుడిగా చేరి, ఆ సభ్యత్వం ఆధారంగా 2023 అక్టోబర్ 20న జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలుపొందారు.