Hyderabad Crime News: ఆటోతో ఢీకొట్టాడు.. స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లమని చెబితే డ్రైవర్ కిరాతకం..

|

Mar 10, 2021 | 4:26 PM

హైదరాబాద్‌లో ఓ ఆటోడ్రైవర్‌ కర్కశంగా వ్యవహరించాడు. ఓ వ్యక్తిని ఆటోతో ఢీకొట్టి.. తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసివెళ్లాడు...

Hyderabad Crime News: ఆటోతో ఢీకొట్టాడు.. స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లమని చెబితే డ్రైవర్ కిరాతకం..
హైదరాబాద్‌లో మానవత్వానికే మచ్చ తెచ్చిన ఆటోడ్రైవర్
Follow us on

హైదరాబాద్‌లో ఓ ఆటోడ్రైవర్‌ కర్కశంగా వ్యవహరించాడు. ఓ వ్యక్తిని ఆటోతో ఢీకొట్టి.. తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసివెళ్లాడు. దీంతో కాసేపు నరకం చూసిన భాధితుడు.. మృత్యువాతపడ్డాడు. రెండు నెలల క్రితం జరిగిన ఈ కేసును కూకట్‌పల్లి పోలీసులు చేధించారు. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన కాకర రామకృష్ణ (55) ఫ్యామిలీతో కలిసి మియాపూర్‌ పరిధి జనప్రియనగర్‌ ఫేజ్‌-2లో నివాసముంటున్నారు. జనవరి 7న సాయంత్రం స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన రామకృష్ణ తిరిగి ఇంటికిరాలేదు.

మరుసటి రోజు మధ్యాహ్నం మూసాపేట కైత్లాపూర్‌ దగ్గరలో గల చెత్త డంపింగ్‌ యార్డు వద్ద రామకృష్ణ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి కూకట్‌పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు టెక్నాలజీ సాయంతో లోతైన దర్యాప్తు చేపట్టారు. రెండు నెలల విచారణ తర్వాత రామకృష్ణ రోడ్డుప్రమాదంలో చనిపోయాడని నిర్ధారించారు.  ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఆ రోజు జరిగింది ఇది….

జనవరి 7వ తేదీన రాత్రి మియాపూర్‌లోని ఓ ఏటీఎంలో  డబ్బులు  రామకృష్ణ డబ్బులు విత్ డ్రా చేసుకున్నాడు. అనంతరం రత్నదీప్‌ సూపర్‌ మార్కెట్‌ వద్ద రోడ్డు దాటేందుకు ప్రయత్నించగా న్యూ హఫీజ్‌పేటకు చెందిన ఆటోడ్రైవర్‌ సయ్యద్‌ షేర్‌ఆలీ (38) తన ఆటోతో వేగంగా ఆయన్ని ఢీకొట్టాడు. దీంతో పక్కనే ఉన్న స్థానికులు ఆటోడ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసి.. తీవ్రంగా గాయపడిన రామకృష్ణను ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ అదే ఆటో ఎక్కించారు. అయితే ఆస్పత్రికి వెళ్తే.. డబ్బులు తననే కట్టామంటారు… పైగా పోలీసు కేసు అవుతుందని భావించిన  సయ్యద్ ఆటోను మూసాపేట కైత్లాపూర్‌లోని డంపింగ్‌ యార్డు వద్దకు ఎవరూలేని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి రామకృష్ణను అక్కడే పడేశాడు. పైగా బాధితుడి జేబులోని సెల్‌ఫోన్‌తో పాటు, రూ.3 వేల నగదును తీసుకుని ఎస్కేప్ అయ్యాడు.

కాగా ఈ కేసులో పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభ్యమవ్వలేదు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో కేసు కొలిక్కి వచ్చింది.  రామకృష్ణ సెల్‌ఫోన్‌తో పాటు ఏటీఎంలో డ్రా చేసిన రూ.3వేల నగదు లేవని వారు పోలీసులకు తెలిపారు. దీంతో ఆ దిశగా కేసు దర్యాప్తు సాగింది. బాధితుడి నుంచి ఎత్తుకెళ్లిన  సెల్‌ఫోన్‌ను ఆటోడ్రైవర్ తన మిత్రుడు లతీఫ్‌కు రెండు నెలల తర్వాత వెయ్యి రూపాయలకు అమ్మాడు. లతీఫ్ ఆ సెల్‌ఫోన్‌ను వినియోగిస్తుండటంతో పోలీసులు సిగ్నల్స్‌ ద్వారా అతడిని అదుపులోకి తీసుకోగా ఆటోడ్రైవర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరపరిచి.. రిమాండ్‌కు తరలించారు.

Also Read:

Kurnool News: బిర్యాని ప్యాకెట్లలో బంగారపు ముక్కు పుడకలు.. అందరూ షాక్.. అసలు విషయం ఇదే…

Viral News: ఎంత చిత్రం గురూ..! 29 వేల లీటర్ల మద్యాన్ని ఎలుకలు తాగేశాయట.. కోర్టుకు తెలిపిన పోలీసులు