
దేశవ్యాప్తంగా ఉగ్రరూపంతో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి..యూపీలోనూ ప్రతాపం చూపెడుతోంది. రాష్ట్రంలో వైరస్ తీవ్రత అంతకంతకూ అధికమవుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్గా తేలిన బాధితుల కోసం హోమ్ ఐసోలేషన్ మార్గదర్శకాలను జారీ చేసింది.
హోం ఐసోలేషన్లో ఉంటున్న కరోనా బాధితుని ఇంటిలో కనీసం రెండు టాయిలెట్లు ఉంటేనే అతను హోంక్వారంటైన్లో ఉండేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు పలు సూచనలు చేస్తూ..సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన వ్యక్తిలో ఎటువంటి లక్షణాలు లేకుండా ఉండి, ఇతర వ్యాధులేవీ లేనివారు మాత్రమే హోంక్వారంటైన్లో చికిత్స పొందేందుకు అనుమతించాలని యూపీ సర్కార్ మార్గదర్శకాలు సూచించింది.
కరోనా సోకిన బాధితుడు హోం క్వారంటైన్లో ఉన్నప్పుడు ..ఆ ఇంట్లో తప్పని సరిగా రెండు టాయిలెట్లు ఉంటేనే, ఆ కుటుంబ సభ్యులు కూడా సురక్షితంగా ఉండగలుగుతారని ప్రభుత్వం చెప్పింది. హోం ఐసోలేషన్లో ఉండేందుకు బాధితులు తప్పని సరిగా తొలుత వైద్యుల అనుమతి తీసుకోవాలని నిర్ధేశించింది. ఇకపోతే, హోం క్వారంటైన్లో ఉన్నవారు ప్రభుత్వం సూచించిన ప్రమాణాలను తప్పక పాటించాలని కోరింది. హెచ్ఐవి, అవయవ మార్పిడి, క్యాన్సర్ మొదలైన సమస్యలతో బాధపడుతున్నవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, అటువంటి కరోనా బాధితులను హోంక్వారంటైన్లో ఉండేందుకు అనుమతించరాదని సూచించింది.
హోంఐసోలేషన్లో ఉంటున్న బాధితులు పల్స్ఆక్సీమీటర్, థర్మామీటర్, మాస్క్తో కూడుకున్న కిట్ను వారు కొనుగోలు చేసుకోవాలని, 24గంటల వైద్యుల పర్యవేక్షణ అవసరమని చెప్పారు. ఏ మాత్రం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా అనిపించిన వెంటనే వైద్యులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా ఆరోగ్యసేతు యాప్ను తప్పక డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పింది.