కరోనా వ్యాక్సిన్ పంపిణీకి యూపీ సర్కార్ కసరత్తు.. కోల్డ్ స్టోరేజీల నిర్మాణం వేగవంతం..

|

Nov 14, 2020 | 12:54 PM

కరోనా మహమ్మారితో దేశం మొత్తం విలవిలలాడుతోంది. వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్ తయారీకి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి.

కరోనా వ్యాక్సిన్ పంపిణీకి యూపీ సర్కార్ కసరత్తు.. కోల్డ్ స్టోరేజీల నిర్మాణం వేగవంతం..
Follow us on

కరోనా మహమ్మారితో దేశం మొత్తం విలవిలలాడుతోంది. వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్ తయారీకి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే అందుబాటులోకి రాగలదని భావిస్తున్న కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను నిల్వ చేసేందుకు యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం అప్పుడే సన్నద్ధమవుతోంది. రాష్ట్ర ప్రజలందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిచనున్నట్టు గతంలో ప్రకటించిన యూపీ సర్కార్ ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కరోనా టీకా ఎంత పరిమాణంలో లభించేదీ కచ్చితంగా తెలీదని.. అయితే దాని నిల్వకు తగిన మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉండటం అత్యవసరమని ఆ రాష్ట్ర ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ ఏపీ చతుర్వేది అభిప్రాయపడ్డారు. ఇందుకు గాను రాష్ట్రంలోని 22 జిల్లాల్లో నూతన కోల్డ్ స్టోరేజీలను నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.. మరో 27 జిల్లాల్లో ఇప్పటికే ఉన్నవాటికి అవసరమైన మరమ్మతు పనులు చేపడుతున్నామని ఆయన వివరించారు. యూపీ రాజధాని లక్నోలో మూడు డిపోలను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వివరించారు.

అతిశీతల ఉష్ణోగ్రత వద్ద వ్యాక్సిన్‌ నిల్వ ఉంచే కోల్డ్‌ చైన్‌ వ్యవస్థ నిర్వహణపై దృష్టి పెట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. డిసెంబర్‌ 15 కల్లా కరోనా వ్యాక్సిన్‌ డిపోలు సిద్ధం కాగలవని అధికారులు ధీమా వ్యక్తం చేశారు.

దేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే, తొలుత వైద్య, ఆరోగ్య సిబ్బందికి తొలివిడత టీకా అందించనున్నట్లు అధికారులు చెప్పారు. అంతేకాకుండా టీకాలు వేసేందుకు అర్హలైన వారి రాష్ట్రస్థాయి జాబితాలు యూపీ సర్కార్ ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం.