
దేశంలో స్వైర విహారం చేస్తున్న కరోనా మహమ్మారి.. ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. రోజురోజు పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతుండగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోనూ వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు కరోనాకు సరైన వ్యాక్సిన్ అందుబాటులో లేని కారణంగా ప్రజలు స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నాయి. సామాజిక దూరం పాటిస్తూ..మాస్క్లు తప్పని సరిగా ధరించాలని సూచిస్తున్నారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలా మాస్క్ ధరించకుండా, నిబంధనలు ఉల్లంఘించిన వేలాది మందిపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. అంతకంతకు విస్తరిస్తున్న వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం నిబంధన తెచ్చినప్పటికీ.. చాలా మంది బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకుండానే యద్ధేచ్ఛగా తిరిగేస్తున్నారు. రోడ్లపైనా, మార్కెట్లు, చాలా చోట్ల అనేక మంది వైరస్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ..మాస్క్ ధరించట్లేదు. అలా మాస్కులు ధరించని వారిపై పోలీసులు, సీసీ కెమెరాల సాయంతో పిటీ కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా తెలంగాణలో ఇప్పటి వరకు 70 వేల మందిపై కేసులు నమోదయ్యాయి. మరి మీరూ మాస్క్ పెట్టుకోకుండా బయటకు వెళ్లి ఉంటే మీపైనా కేసు నమోదై ఉండవచ్చు. ఎందుకైనా మంచిది ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండండి..కరోనా పట్ల అవగాహనతో ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పని సరిగా మాస్క్ ధరించాలని అధికారులు సూచిస్తున్నారు.