కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వాయిదా పడిన పలు క్రీడలు తిరిగి కొత్త షెడూల్డ్ తో సిద్దమవుతున్నాయి. ఇందులో భాగంగా జర్మన్ లీగ్ ఫుట్బాల్ ను మే 9వ తేదీన ప్రారంభించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. అయితే ప్రేక్షకులు లేకుండానే జరిగే ఈ స్పోర్ట్స్ ఈవెంట్ కు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తుది నిర్ణయం తీసుకోవాల్సింది ఉంది. మరోవైపు ఐసీసీ కూడా వన్డేస్, టి 20 ప్రపంచ కప్, 2021 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ కోసం ప్రణాళికలను సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం ప్రపంచ స్థాయి క్రీడల నిర్వహణపై కూడా పడింది. ఆటగాళ్లకు వైరస్ ముప్పు పొంచి ఉండటంతో ఈ ఏడాది టోక్యోలో జరగాల్సిన సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ తో పాటు పలు స్పోర్ట్స్ ఈవెంట్స్ ఇప్పటికే రద్దయ్యాయి. ఒక దశలో ప్రేక్షకులు లేకుండా క్రీడలను నిర్వహించాలనే ప్రతిపాదన వచ్చినా క్రీడాభిమానులు లేకుండా ఖాళీ స్టేడియాలతో నిర్వహించడం సమంజసం కాదని వెనక్కి తగ్గారు..ఐరోపాలో కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 12 నుంచి జులై 12 వరకు జరగాల్సిన యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్ బాల్ అసోసియేషన్ – UEFA టోర్నీని ఏకంగా ఏడాది పాటు వాయిదా వేసి, 2021 జూన్ 11 నుంచి జులై 11 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం ఫుట్ బాల్ ప్రియులను తీవ్రంగా నిరాశ పరిచింది.. UEFA ఈ టోర్నీ చరిత్రలో తొలిసారిగా ఇలా ఫైనల్ స్టేజీ పోటీలు వాయిదా పడ్డాయి. వీటితో పాటు ఐరోపాలోని ఇంగ్లాండ్, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ ఫుట్బాల్ లీగ్లు కూడా రద్దయ్యాయి. ఫిఫా వరల్డ్కప్ క్వాలిఫయర్ మ్యాచ్లూ రద్దు చేశారు. ఇదిలా ఉంటే జర్మనీ ఫుట్బాల్ లీగ్ తాజాగా మే 9వ తేదీన ఈవెంట్స్ ప్రారంభం కానుంది..
జర్మనీలో ప్రఖ్యాత ఫుట్ బాల్ క్లబ్ లో సమావేశం తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు. కరోనా వైరస్ సోషల్ డిస్టెన్స్ ఆంక్షల నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే ఈవెంట్ నిర్వహిస్తారు. ప్రతి ఆటకు క్రీడాకారులు, కోచ్లు, అధికారులు, మీడియాతో సహా ప్రతి ఆటకు సుమారు 200 మందిని మాత్రమే స్టేడియంలో అనుమతించనున్నారు. ఈ పోటీలను కొనసాగించకపోతే UEFA ఫైనల్స్ మెరిట్ అర్హతకు ఇబ్బంది వస్తుందని భావిస్తున్నారు. కాగా ఫుట్బాల్ లీగ్ నిర్వహణ విషయంలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఇక క్రికెట్ విషయానికి వస్తే కరోనా నేపథ్యంలో ఈవెంట్స్ వాయిదా వేసుకున్న ఐసీసీ కూడా తన కార్యక్రమాలను పునరుద్దరించడానికి సిద్దమైంది. ఇందులో భాగంగా జూన్ లో నిర్వహించాల్సిన వన్డేలపై త్వరలో నిర్ణయం తీసుకుంటారు. అదే విధంగా అక్టోబర్, నవంబర్ లో జరిగే టి 20 ప్రపంచ కప్, 2021 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ కోసం కూడా ఐసీసీ ప్రణాళికలను సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత వరకూ బాగానే ఉన్నా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా ముప్పు నేపథ్యంలో ఈ క్రీడలను నిర్వహిస్తే భౌతిక దూరం ఆంక్షల ఉల్లంఘన జరిగే ప్రమాదం ఉంది. క్రీడాభిమానులను కట్టడి చేయడం చాలా కష్టమవుతుంది. అలాగని అసలు ప్రేక్షకులు లేకుండా ఈవెంట్స్ నిర్వహిండం కూడా అంతగా బాగుండదని భావిస్తున్నారు.