వరాహ, నరసింహ అవతారాల కలియికగా కొలువుదీరిన సింహాచల అప్పన్నకు రేపు చందనోత్సవం (నిజరూప దర్శనం) నిర్వహించనున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో అతి తక్కువ మంది భక్తులతోనే ఈ సారి ఉత్సవాన్ని పూర్తి చేయనున్నారు. ఇప్పటికే కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్, మెట్ల మార్గాలను మూసివేశారు. ఆలయ మార్గాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 7 గంటల వరకు ఆలయ మార్గాలు మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారి మేల్కొలుపు.. చందనోత్తరణ నిర్వహిస్తారు.
ఉత్తరాంద్ర వాసుల కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారు స్వామిగా సింహాచల అప్పన్నను భక్తులు కొలుస్తుంటారు. అలాంటి స్వామివారి నిజరూప దర్శనం ఒక్క రోజు మాత్రమే కలుగుతుంది. అదే వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ రోజు. దీనినే చందనోత్సవంగా పిలుస్తారు. పురూరవ చక్రవర్తుల కాలం నుంచి నేటి వరకూ చందనోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్రులతో సింహాద్రి అప్పన్నగా కీర్తించబడే లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఏటా సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుతుంటారు. ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివారి నిజరూప దర్శనాన్నిచూసి తరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కానీ, ఈ యేడు కరోనా కారణంగా లాక్డౌన్ నేపధ్యంలో పరిమిత సంఖ్యలో వైదిక సిబ్బందితో ఉత్సవానికి ఏర్పాట్లు చేశారు.
ఉత్సవంలో భాగంగా సింహాచలేశుని ఆదివారం తెల్లవారుజామున 1 గంటకు సుప్రభాత సేవతో మేల్కొలిపి గంగధార నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం చేస్తారు. ఆ తరువాత బంగారు, వెండి బొరిగెలతో స్వామి దేహంపై కప్పి ఉంచిన చందనాన్ని తొలగిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి శిరస్సు, వక్షస్థలంపైన రెండు పచ్చి చందనపు ముద్దలను ఉంచుతారు. అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్తలైన పూసపాటి వంశీయులకు తొలి దర్శనం కల్పిస్తారు. ఆ తరువాత వీవీఐపీ, ప్రోటోకాల్ దర్శనాలు ఉంటాయి. ఉదయం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ సామాన్య భక్తులకు స్వామి దర్శనానికి అనుమతిస్తారు. కానీ, ఈ సారి ఉత్సవాల సందర్భంగా కొండపైకి భక్తులు, వీఐపీలు, వీవీఐపీలకు అనుమతి నిరాకరించారు. కేవలం ఆలయ సిబ్బంది, పూజారుల మధ్యే తంతు పూర్తి చేయనున్నారు.
రాత్రికి వెయ్యి మంది రుత్వికులు గంగధార నుంచి పవిత్ర జలాలను తీసుకు వచ్చి స్వామికి అభిషేకం చేసి, వివిధ రకాల ఫల, పుష్ప, శీతలాదులతో కూడిన అనేక పూజాసామగ్రితో అత్యంత వైభవంగా సహస్రఘటాభిషేకం నిర్వహిస్తారు. ఆ తరువాత అప్పటికే సిద్ధం చేసి వుంచిన మూడు మణుగుల చందనాన్ని స్వామికి సమర్పించి నిజరూపం నుంచి నిత్య రూపంలోకి తీసుకువస్తారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మందిభక్తులు తరలివస్తారు. కానీ, కరోనా మహమ్మారి ఏపీలో వేగంగా విస్తరిస్తున్న క్రమంలో ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచే కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డు, మెట్ల మార్గాలు మూసివేశారు. ఆలయ మార్గాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 7 గంటల వరకు ఆలయ మార్గాలు మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.