యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి గురించి తెలిసిందే. ఇప్పటి వరకు దీనికి వ్యాక్సిన్ లేకపోవడంతో.. రోజురోజుకు లక్షల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వ్యాక్సిన్ను కనుగొనేందుకు అనేక దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం నాడు రష్యా గుడ్న్యూస్ తెలిపింది. సెచెనోవా యూనివర్సిటీ ఆధ్వర్యంలో తయారుచేసిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయని ప్రకటించింది. సెచెనోవ్ ఫస్ట్ మాస్కో స్టేట్ మెడికల్ యూనివర్శిటీలో.. వాలంటీర్లపై తొలి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైందని.. ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్లేషనల్ మెడిసిన్ అండ్ బయోటెక్నాలజీ డైరెక్టర్ వాడిమ్ తారాసోవ్ ఓ అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీస్తో తెలిపారు. ఈ క్లినికల్ ట్రయల్స్లో పాల్గొన్న తొలి బృందం.. బుధవారం నాడు డిశ్చార్జ్ కానుందని.. ఇక రెండో బృందం జూలై 20 వ తేదీన డిశ్చార్జ్ కానుందని తెలిపారు.
కాగా, రష్యాకు చెందిన మాస్కోకు చెందిన గమలీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ తయారు చేసిన వ్యాక్సిన్ కూడా క్లినికల్ ట్రయల్స్ను గత నెల జూన్ 18న ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం సెచెనోవ్ యూనివర్సిటీ జరిపిన క్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయని తారసోవ్ తెలిపారు.