
లాక్డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుబడిన వలస కూలీలు.. తినడానికి తిండి లేక తమ స్వస్థలాలకు తిరిగి వెళ్తున్నారు. ఏకంగా వందల కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్తూ.. కాళ్లు బొబ్బలెక్కినా ప్రయాణం సాగిస్తూనే ఉన్నారు. ఇలా నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీలకు విజయవాడ పోలీసులు ప్రత్యేకమైన స్టాల్స్ ఏర్పాటు చేసి ఉచిత సేవలు అందిస్తున్నారు.
ఏపీ సీఎం జగన్ ఇదివరకే నడుచుకుంటూ వెళ్లే వలస కూలీలకు ఆహారం, నీరు అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇలా ప్రత్యేకమైన స్టాల్స్ ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. నడిచివచ్చే వారి కోసం సర్వింగ్ సెంటర్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ, అరటిపండ్లు, కాళ్లకు చెప్పులను ఉచితంగా అందిస్తున్నారు. ఇంకా ఏమైనా కావాలా అని అడిగి మరీ సహాయం చేస్తున్నారు.
విజయవాడలోని గొల్లపూడి వై జంక్షన్, బెంజ్ సర్కిల్ దగ్గర బెజవాడ సీపీ ఈ ఫ్రీ సర్వీసు కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీతో పాటూ ఇతర పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు. అలాగే వివిధ ప్రాంతాల్లో కూడా వలస కూలీలకు ఆహారం, నీరు, ఇతర సదుపాయాలతో పాటు షెల్టర్లు కూడా కల్పించారు అధికారులు.
Read More: