COVID DEADBODIES: కరోనా మృతుల విషయంలో ఆందోళన వద్దు.. జాగ్రత్తలతో అంత్యక్రియలు నిర్వహించినా ప్రమాదమేమీ లేదు

|

May 10, 2021 | 5:18 PM

కరోనా వైరస్ సోకి మరణిస్తున్న వారి మృతదేహాల పట్ల పలువురు అనుసరిస్తున్న ధోరణి చాలామందిని కలవరానికి గురి చేస్తోంది. రక్త సంబంధం ఉన్నవారు కూడా కరోనాతో మృతి చెందిన తమ సమీప వ్యక్తుల మృతదేహాలకు...

COVID DEADBODIES: కరోనా మృతుల విషయంలో ఆందోళన వద్దు.. జాగ్రత్తలతో అంత్యక్రియలు నిర్వహించినా ప్రమాదమేమీ లేదు
Follow us on

COVID DEADBODIES NOT AT ALL DANGEROUS: కరోనా వైరస్ (CORONA VIRUS) సోకి మరణిస్తున్న వారి మృతదేహాల పట్ల పలువురు అనుసరిస్తున్న ధోరణి చాలామందిని కలవరానికి గురి చేస్తోంది. రక్త సంబంధం ఉన్నవారు కూడా కరోనా (CORONA)తో మృతి చెందిన తమ సమీప వ్యక్తుల మృతదేహాలకు అంత్యక్రియలు (FUNERAL) కూడా నిర్వహించని పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తుంది. కన్న తల్లిదండ్రుల శవాలను వదిలి పెడుతున్న పిల్లలు ఎందరో కనిపిస్తున్నారు. అదే సమయంలో అనాధ శవాలను అలా వదిలివేయకుండా సేవాతత్పరతతో కొంతమంది వందలాది మృతదేహాలకు స్వయంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్న పరిస్థితులు కూడా చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మృతదేహాల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందా అనే ఈ విషయంలో తాజాగా అత్యంత కీలకమైన అంశాలు వెలుగు చూశాయి.

ఒకవైపు దేశంలో ప్రతిరోజూ నాలుగు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుంటే.. ఇంకోవైపు ప్రతిరోజు నాలుగు వేల మందికిపైగా వైరస్ బారినపడి మృత్యువు ఒడిలోకి చేరుతున్నారు. గత నెల రోజులుగా దేశంలో కరోనా మరణాల (CORONA DEATHS) సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. భారీగా సంభవిస్తున్న మరణాలకు అనుగుణంగా అంత్యక్రియల విషయంలో సరైన ఏర్పాట్లు లేకపోవడం ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి. చాలా చోట్ల కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాలను ఆసుపత్రిలోనే వదిలి వెళ్తున్న పరిస్థితి. అలాంటి వారికి మున్సిపాలిటీలు (MUNICIPALITIES), గ్రామ పంచాయతీలు (GRAMA PANCHAYATHS), కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. చాలా చోట్ల అంత్యక్రియల్లో కనీస సంప్రదాయాలను కూడా పాటించని పరిస్థితి కనిపిస్తోంది. సామూహిక అంత్యక్రియలు జరుపుతున్న పరిస్థితి.. సామూహికంగా ఖననం చేస్తున్న పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తుంది. కరోనా భయం నేపథ్యంలో పాడె మోయడానికి కూడా ఎవరూ ముందుకు రాని దృశ్యాలు గత కొన్ని రోజులుగా సర్వసాధారణమైపోయాయి. దాంతో ట్రాక్టర్లు, ట్రాలీలు, జెసిబిలతో శవాలను తరలిస్తున్నారు. కడసారి చూడటానికి కూడా దగ్గరికి ఎవరూ రాకపోవడం మృతదేహాలను నేరుగా స్మశానాలకు చేర్చడం జరుగుతోంది. ఇలాంటి దృశ్యాలు గత కొన్ని రోజులుగా సర్వసాధారణమైపోయాయి. ఇలాంటి దృశ్యాలు చూస్తున్న వారి హృదయాలు ద్రవించుకుపోతున్నాయి. అయితే నిజానికి కోవిడ్ మృతదేహాల విషయంలో ఇంత భయం అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించవచ్చని వారు తేల్చి చెబుతున్నారు.

కరోనా సోకిన వ్యక్తి మరణిస్తే ఆ తర్వాత అతని శరీరంలో వైరస్ ఉత్పత్తి ఆగిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చనిపోయిన వ్యక్తి శరీరంలో వైరస్ కేవలం నాలుగు నుంచి ఆరు గంటలు మాత్రమే బతికి వుంటుందని చెబుతున్నారు. అప్పటికే బాడీలోని ఫ్లూయిడ్స్‌లో వైరస్ ఉన్నా దానికి శరీరంలోని ఇతర ప్రదేశాలకు వ్యాపించే శక్తి వుండదని వైద్యులు చెబుతున్నారు. మృతదేహాన్ని నేరుగా తాకడం, పైన పడి ఏడవడం, చనిపోయిన వారి తలను ఒడిలో పెట్టుకుని ఉండటం వంటి చర్యల వల్ల మాత్రమే వైరస్ ఇంకొకరికి లేనిపక్షంలో వైరస్ విస్తరించే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. మృతదేహాన్ని ఉంచిన జిప్ బ్యాగ్ మూసి ఉంటే వైరస్ సోకే అవకాశం దాదాపు లేదని వారు స్పష్టం చేశారు. మృతదేహాల నుంచి ఇతరులకు వైరస్ సోకిన దాఖలాలు లేవని, ఇప్పటికే వైరస్ లక్షణాలు ఉన్నవారు దహన సంస్కారాలలో లేదా ఖనన క్రియల్లో పాల్గొంటే వారి ద్వారా మాత్రమే ఇతరులకు కరోనా వైరస్ సోకుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. భారీ సంఖ్యలో జనం ఒకేచోట గుమికూడి వుండడం, తమకు దగ్గరి వారు చనిపోయిన బాధలో ఒకరిపై మరొకరు పడి ఏడవడం, భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు పెట్టుకోకపోవడం వంటి చర్యల కారణంగానే వైరస్ వ్యాప్తి చెందుతుందని అంటున్నారు.

ఎవరైనా వ్యక్తి కోవిడ్ సోకి మరణిస్తే వైద్యులు.. ఆసుపత్రిలోనే మృతదేహాన్ని సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రం చేసి తడి వస్త్రాన్ని చుట్టి బంధువులకు ఇస్తున్నారు. వైరస్ బయటకు రాకుండా మృతదేహాన్ని కేవలం ముఖం మాత్రమే కనిపించేలా చేసి అందజేస్తున్నారు. ఇలాంటి మృతదేహాలకు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించవచ్చు. కానీ చాలా మంది కరోనా వైరస్‌కు భయపడి మృతదేహం దగ్గరికి రావడం లేదు. ఆసుపత్రుల్లో అలా అనాథ శవాల్లా వదిలేసి వెళ్ళిపోతున్నారు. మృతదేహాలను తీసుకెళ్లిన కొద్దిమంది సైతం సరైన అంత్యక్రియలు నిర్వహించకుండా వారి ఆత్మ ఘోష చెందేలా ప్రవర్తిస్తున్నారు. కనీస మానవత్వం లేకుండా ట్రాక్టర్, జెసిబిలలో మృతదేహాన్ని తీసుకెళ్లి పడేస్తున్నారు. ఇలాంటి చర్యలు అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకొని మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. దీని వల్ల ఎలాంటి ప్రమాదం లేదని వైద్య వర్గాలంటున్నాయి. తద్వారా వైరస్ ఇతరులకు సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.. ఇది తాజాగా వైద్య వర్గాలు చెబుతున్న మాట.

ALSO READ: చిన్నమ్మ తెరచాటు రాజకీయం షురూ.. చెన్నై ఆఫీసు ఎదుట శశికళ అనుకూల వర్గం ఏంచేసిందంటే?