Covid-19: దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న మాయదారి కరోనా.. మరింత దిగజారుతున్న పరిస్థితులు.. మే నాటికి ప్రపంచంలోనే అగ్రస్థానం..!

|

Apr 24, 2021 | 8:58 AM

భారత్‌లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు మూడు లక్షలు దాటాయి కరోనా కేసులు. రోజువారీ కరోనా కేసుల్లో భారత్‌ ప్రపంచ రికార్డ్ సృష్టించింది.

Covid-19: దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న మాయదారి కరోనా.. మరింత దిగజారుతున్న పరిస్థితులు.. మే నాటికి ప్రపంచంలోనే అగ్రస్థానం..!
India Corona
Follow us on

Covid-19 Fresh infections: భారత్‌లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు మూడు లక్షలు దాటాయి కరోనా కేసులు. రోజువారీ కరోనా కేసుల్లో భారత్‌ ప్రపంచ రికార్డ్‌ సృష్టించింది. దేశంలో కొత్తగా 3.46 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 2,620 మంది మృతి కరోనా చనిపోవడం కలిచివేస్తోంది. ఇక, దేశవ్యాప్తంగా ప్రస్తుతం 25,43,914 కరోనా యాక్టివ్ కేసులు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో కరోనాతో ఇప్పటివరకు మొత్తం 1,89,549 మంది చనిపోయారు. ఇక ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ సోకిన వారి సంఖ్య 1,66,02,456కి చేరింది.

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అంతకంతకు విజృంభిస్తునే ఉంది. రోజు రోజుకీ కొత్త రూపం మార్చుకుంటూ విస్తరిస్తుంది. దేశంలో ప్రతి గంటకు 14,373 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. కరోనాతో గంటకు 109 మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం చేస్తోంది. 24 గంటల్లో 773 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో 348 మంది చనిపోయారు. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 66,836 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 24331 కేసులు నమోదయ్యాయి.

ఇదిలావుంటే, ప్రపంచవ్యాప్తంగా నమోదైన కరోనా కేసులను పరిశీలిస్తే.. బ్రెజిల్‌లో గురువారం 79,719 కేసులు రికార్డు అయ్యాయి. అమెరికాలో 62,642 కేసులు, టర్కీలో 54,791 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీని బట్టి చూస్తే, భారత దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎంత వేగంగా నమోదవుతోంది అద్ధం పడుతోంది. గడిచిన మూడు రోజుల వ్యవధిలోనే మిలియన్ ‌పైగా కేసులు నమోదు కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయంగా నమోదైన మొత్తం 8.90 లక్షల కేసుల్లో 37 శాతం భారతదేశంలోనే నమోదు కావడం విశేషం.

భారత్‌లో మే ప్రథమార్ధంలో గరిష్ఠ స్థాయికి చేరుతుందని మిషిగన్‌ యూనివర్సిటీ సంచలన నివేదిక వెల్లడించింది. అప్పటికల్లా ప్రభుత్వపరంగా వెల్లడించే రోజువారీ కేసుల సంఖ్య 10 లక్షలకు, మరణాలు 5వేలకు చేరే అవకాశం ఉందని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌’ అంచనా వేసింది. ఆగస్టు నాటికి ఉద్ధృతి తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు. వెలుగులోకి రాని కేసులతో కలిపి మొత్తం ఇన్‌ఫెక్షన్లు మే మధ్యనాటికి గరిష్ఠ స్థాయిలో 45 లక్షలకు చేరొచ్చని సర్వే నివేదికలు చెబుతున్నాయి. పరిస్థితులు దిగజారితే అది 50 లక్షలకూ చేరే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

భారత్‌లో ప్రస్తుతం రోజుకు 3 లక్షల కేసులు మాత్రమే వెల్లడిస్తున్నా పరిస్థితులు అంతకంటే దారుణంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ కఠినమైన లాక్‌డౌన్‌లు విధించడం, మాస్క్‌లు తప్పనిసరిగా ఉపయోగించడం, భారీ సమూహాలను నిషేధించడం, అంతర్రాష్ట్ర రాకపోకలను నియంత్రించడం, వ్యాక్సినేషన్‌ పెంచడం ద్వారా గణాంకాలను తగ్గించవచని మిషిగన్‌ యూనివర్సిటీ అభిప్రాయపడింది. కరోనా రెండో ఉద్ధృతి వచ్చే నెల 11-15 మధ్య తారాస్థాయికి చేరవచ్చని కాన్పుర్‌, హైదరాబాద్‌ ఐఐటీ శాస్త్రవేత్తలు రూపొందించిన గణిత నమూనా పేర్కొంది. ఆ సమయంలో దేశంలో యాక్టివ్‌ కేసులు 33-35 లక్షలకు చేరొచ్చని వివరించారు.

Read Also…  Corona Virus: దేశవ్యాప్తంగా దడ పుట్టిస్తున్న కరోనా మహమ్మారి.. ట్రిపుల్‌ మ్యూటెంట్‌ స్ట్రెయిన్లు ప్రమాదకరమంటున్న నిపుణులు