Blood Scarcity: దేశంలో రక్తం కొరత రాబోతుందా?.. బ్లడ్ బ్యాంకుల్లో అడుగంటుతున్న రక్త నిలువలు.. పొంచి ఉన్న ప్రమాదం!

రక్తం వల్ల ప్రాణాలు పోతాయి. దాని వల్లే విలువైన ప్రాణాలు కూడా నిలుస్తాయి. అలాంటి ప్రాణాధారమైన రక్త నిలువలు అడుగంటాయి. ఎక్కడికి వెళ్లినా నో స్టాక్‌.. నో బ్లడ్‌ అన్న సమాధానమే వస్తుంది.

Blood Scarcity: దేశంలో రక్తం కొరత రాబోతుందా?.. బ్లడ్ బ్యాంకుల్లో అడుగంటుతున్న రక్త నిలువలు.. పొంచి ఉన్న ప్రమాదం!
Blood Scarcity
Follow us

|

Updated on: Jun 08, 2021 | 11:09 AM

Blood Shortage Ahead of Mass Vaccination: రక్తం వల్ల ప్రాణాలు పోతాయి. దాని వల్లే విలువైన ప్రాణాలు కూడా నిలుస్తాయి. అలాంటి ప్రాణాధారమైన రక్త నిలువలు అడుగంటాయి. ఎక్కడికి వెళ్లినా నో స్టాక్‌.. నో బ్లడ్‌ అన్న సమాధానమే వస్తుంది. రక్తం అవసరం ఉన్న రోగుల బంధువులు కాళ్లరిగేలా బ్లడ్‌ బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడ పోయినా నిరాశే ఎదురవుతోంది. దీంతో ప్రతి నిత్యం రక్తంపైనే ఆధారపడ్డ ప్రాణాలు.. గాల్లో కలిసే ప్రమాదం పొంచి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితులు తీవ్ర ఆందోళన కల్గిస్తున్నాయి. దాదాపు అన్ని చోట్ల నిల్వలు అడుగంటాయి. ప్రధానంగా రక్తం నిల్వ చేసే రెడ్‌ క్రాస్‌ బ్లడ్‌ బ్యాంకుల్లోనే నో స్టాక్‌.. నో బ్లడ్‌ అన్న సమాధానం వస్తోంది. పరిస్థితులు ఎంతలా ఉన్నాయంటే.. బ్లడ్‌ బ్యాంక్‌ మొత్తంలో ఒక్క యూనిట్‌ లేని పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి.

ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ బ్లడ్‌ బ్యాంక్స్‌ ఆంధ్రప్రదేశ్‌లో 18 ఉండగా.. వాటిల్లో కేవలం 4 వందల యూనిట్లు మాత్రమే నిల్వ ఉంది. కృష్ణా జిల్లాలోని రెడ్‌ క్రాస్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో ఈ వారం కేవలం ఒకే ఒక్క యూనిట్‌ రక్తం అందుబాటులో ఉంది. అటు అనంతపురంలోనూ రెండే యూనిట్లు ఉన్నాయి. ఇలా అన్ని జిల్లాల్లో సింగిల్‌ డిజిట్‌ నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ కొరత ప్రభావం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిపై తీవ్రంగా చూపుతోంది. ఒక్కో సమయంలో విలువైన ప్రాణాలు కూడా పోతున్నాయి.

తలసేమియా రోగులు అయితే.. రక్తదానం చేసే దాతలపైనే ఆధారపడి బతుకుతారు. అలాంటిది.. ఇప్పుడు దాతలు లేక పోవడంతో వారి జీవితాలు గాల్లో దీపంలా మారిపోయాయి. తలసేమియాతో బాధపడుతున్న వారి బంధువులు రక్తం కోసం ఆస్పత్రులు, బ్లడ్‌ బ్యాంక్‌ల చుట్టూ తిరుగుతున్నారు. తలసేమియా రోగులు, గర్బిణీలు, ఆక్సిడెంట్స్‌లో గాయాల పాలైన వారు రక్తం కోసం ఎదురు చూస్తున్నారు. వీరందరికి నిరాశే ఎదురవుతోంది. అసలే ఎండాకాలం, దానికి తోడు కరోనా రావడంతో రాష్ట్రంలో అన్ని స్వచ్ఛంద సంస్థల బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తం నిల్వలు అడుగంటిపోయాయి. దానికి తోడుగా వ్యాక్సినేషన్ జరుగుతుండడంతో.. ఆ ప్రభావం తీవ్రంగా చూపుతోంది. వ్యాక్సిన్‌ వేసుకున్నాక 8 వారాల పాటు రక్తం ఇవ్వకూడదన్న మార్గదర్శకాలు ఉన్న నేపథ్యంలో రక్త విపత్తు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

సాధారణ పరిస్థితుల్లో వాస్తవానికి జూన్‌లో 5వేల యూనిట్ల రక్తం అందుబాటులో ఉంటుంది. వేసవి కావడంతో కళాశాలలు ఉండవు. కాబట్టి రక్తం ఎక్కువగా ఇచ్చే యూత్‌ అందుబాటులో లేక పోవడం కూడా ఒక కారణమే. మరోవైపు, కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతమైన నేపథ్యంలో మూడు నెలలుగా రక్త దాన శిబిరాలు పూర్తిగా నిలిచి పోయాయి. ఇక బ్లడ్‌ బ్యాంక్‌కు వెళ్లి రక్తదానం చేస్తే ఎక్కడ కరోనా అంటు కుంటుందోనన్న భయం కూడా వెంటాడుతోంది. దీంతో బ్లడ్‌ బ్యాంక్‌కు వెళ్లి రక్తం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. సినీహీరోల బర్త్‌డేల సమయంలో కూడా ఫ్యాన్స్‌ పెద్ద సంఖ్యలో రక్త దానం చేసేవారు. ఇప్పడు అలాంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు.

ఇక, రక్తం అవసరం మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి ముందుగా ప్లాన్ చేసుకున్న ఆపరేషన్లకు, రెండు ప్రమాదాల సమయంలో, మూడవది తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు. ఆపరేషన్లు, క్షతగాత్రులకు కొంత సమయం ఉంటుంది, ఓల్డ్ రక్తం కూడా ఇవ్వొచ్చు. కానీ.. తలసేమియా రోగులకు మాత్రం రక్తం సేకరించిన ఐదు రోజుల లోపే ఫ్రెష్‌ బ్లడ్‌ ఎక్కించాలి. ఇలా ప్రతి 20 రోజులకు ఒక సారి రక్తం అవసరం ఉంటుంది. ఇలాంటిది ఇప్పుడు ఈ రోగులకు బ్లడ్‌ కొరత ప్రాణ సంకటంగా మారింది. రెడ్‌ క్రాస్‌ సొసైటీ సిబ్బంది ఎంత ప్రయత్నం చేసినా రక్త దానం చేసే వారు ఎక్కడా కనిపించడం లేదంటున్నారు. తమ దగ్గర ఉన్న కాంటాక్ట్‌ నెంబర్లకు ఫోన్లు చేసినా సరైన స్పందన రావడం లేదని రెడ్‌ క్రాస్‌ సొసైటీ సభ్యులు అంటున్నారు.

వ్యాక్సిన్‌ తర్వాత ఇవ్వడం కుదరదంటున్న నిపుణులు.. వ్యాక్సిన్‌కు ముందే రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని పిలుపునిస్తున్నారు. బ్లడ్‌ బ్యాంక్‌ల్లో కూడా కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు బీవీఎస్‌ కుమార్‌. సోషల్‌ డిస్టెన్స్‌ ఉండేలా ఏర్పాట్లు చేశామని రక్తం ఇవ్వడానికి యూత్‌ ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. రక్త దానం చేసేవారు ఎవరైనా ఉంటే.. తమ టోల్‌ ఫ్రీ నెంబర్‌కి ఫోన్‌ చేస్తే తామే వస్తామంటున్నారు.

కరోనా వల్ల పరిస్థితులు దారుణంగా మారాయంటున్నారు విశాఖ రెడ్‌ క్రాస్‌ సొసైటీ సభ్యులు. బ్లడ్‌ బ్యాంక్‌లో రక్త నిల్వల కోసం తమ ప్రయత్నం చేస్తూనే ఉన్నామంటున్నారు. కరోనా వల్ల ఎలాంటి అపోహలు నమ్మొద్దని.. రక్త దానం చేసేందుకు ముందుకు రావాలంటున్నారు రెడ్‌ క్రాస్‌ సొసైటీ సభ్యులు సూచిస్తున్నారు.

ఇటు, తెలంగాణలోనూ రక్తం నిల్వలు నిండుకున్నాయి. తలసేమియా పేషెంట్లు, వైద్య వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కరోనా భయం, లాక్‌డౌన్‌తో దాతలు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రస్తుతం రెడ్‌క్రాస్‌ దగ్గర 3వందల యూనిట్లు మాత్రమే నిల్వలున్నాయి. అయితే.. కరోనాకు ముందు ప్రతి నెలా 3వేల యూనిట్ల రక్తసేకరణ మాత్రమే జరిగేది. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారి పోయాయి. ఈ పరిస్థితిని చక్క దిద్దేందుకు ఈ నెల 17న 75 క్యాంపుల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. చూడాలి మరి ఎంత మంది ముందుకు వస్తారో.

Read Also….  అధునాతన వెంటిలేటర్ల సృష్టిలో ఇస్రో……త్వరలో అందుబాటులోకి రానున్న మూడు రకాల ‘ప్రాణాధార యంత్రాలు’ !