తెలంగాలో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. గురువారం మరో 27 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటి వరకు970కి చేరింది. 25మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 13, గద్వాల జిల్లాలో 10 కేసులు నమోదైనట్లుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. కాగా, వైరస్ నుంచి కోలుకున్న వారిలో 58 మంది డిశ్చార్జి అయ్యారని చెప్పారు. దీంతో రాష్ర్టంలో మొత్తం 252 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారని, మరో 693 మంది చికిత్స పొందుతున్నారని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని మంత్రి ఈటల తెలిపారు. కరోనా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన మంత్రి టెస్టులకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. 9 ల్యాబ్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. కాగా, డెత్ రేట్ తగ్గించుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేయాలని వైద్యులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. పీపీ కిట్లు 4 లక్షలు ,N95 మాస్క్ లు 4. 5 లక్షలు నిల్వ చేశామని పేర్కొన్నారు. గచ్చి బౌలి లో ఆస్పత్రి అందుబాటులోకి వచ్చిందని, త్వరలో ఈ ఆస్పత్రిలో సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. క్యాన్సర్, కిడ్నీ, డయాలసిస్ పేషేంట్లు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఈటల పేర్కొన్నారు. కరీంనగర్ లో ఎలాగైతే సీరియస్ గా తీసుకున్నామో అలాగే సూర్య పేట, గద్వాల్ లో కూడా అదే పద్ధతి ని అవలంభిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.