దేశంలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. రోజురోజుకూ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లోనే దాదాపు రెండు వేల మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 37 వేలు దాటింది. మరో 77 మంది మృతిచెందగా, మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,223కి చేరింది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలోనే 11వేల మంది వైరస్ బారినపడ్డారు. శుక్రవారం ఏకంగా 1,008 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఒక్క ముంబైలోనే 750 కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావటం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది.
కోవిడ్ ధాటికి మహారాష్ట్ర చిగురుటాకుల వణికిపోతోంది. రాష్ట్రంలో కోవిడ్ వైరస్ ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 1,008 కరోనా కేసులు నమోదయ్యాయి. 106 మంది బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయినట్లుగా వైద్యాధికారులు వెల్లడించారు. 26 మంది వైరస్ బారిన పడి మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 485కు చేరింది. ఒక్క ముంబయ్ మహానగరంలోనే 296 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబయిలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,825కు చేరింది. దీన్ని బట్టి అక్కడ కరోనా తీవ్ర ఇంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మహారాష్ట్రలో 9,142 యాక్టివ్ కేసులున్నట్లు మహారాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.