లాక్డౌన్ ఉల్లంఘించి.. ప్రముఖ యూనివర్సిటీ పైత్యం.. షోకాజ్ నోటీసులు..!
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు లాక్డౌన్ను ప్రకటించిన కేంద్రం.. దాన్ని అందరూ కచ్చితంగా పాటించాలని సూచించారు. అంతేకాదు లాక్డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు.

కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు లాక్డౌన్ను ప్రకటించిన కేంద్రం.. దాన్ని అందరూ కచ్చితంగా పాటించాలని సూచించారు. అంతేకాదు లాక్డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. అయితే కొందరు మాత్రం ఆ నిబంధనలను తుంగలోకి తొక్కేస్తున్నారు. ఇటీవల పంజాబ్లోని ప్రముఖ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కేంద్ర, రాష్ట్ర విధించిన లాక్డౌన్ ఆదేశాలను బేఖాతరు చేసింది. దాదాపు 3వేల మందిని( విద్యార్థులు, ఫ్యాకల్టీతో కలిపి) క్యాంపస్ అనుబంధ హాస్టల్లో ఉండేందుకు యునివర్సిటీ యాజమాన్యం అనుమతులు ఇచ్చింది.
అయితే ఆ యూనివర్సిటీలో ఉన్న ఓ విద్యార్థికి ఏప్రిల్ 12న కరోనా పాజిటివ్ రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు ఉల్లఘించిన సదరు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వెంటనే రంగంలోకి దిగిన ఉన్నత విద్యాశాఖ అధికారులు యూనివర్సిటీ యాజమన్యం తీరును తప్పుబడుతూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కరోనా విస్తరిస్తున్న వేళ ఇలాంటి చర్యలతో మిగిలిన వారి ప్రాణాలతో ఆడుకుంటారా అంటూ మండిపడ్డ విద్యాశాఖ.. నిర్లక్ష్యం, బాధ్యతారహితంగా ఉంటారా అంటూ చివాట్లు పెట్టింది.
ఈ క్రమంలో సదరు యూనివర్సిటీ యాజమాన్యానికి ఏడు రోజుల గడువును నిర్ధేశించిన అధికారులు.. ఆ లోపు అన్ని వివరాలు తెలపాలని ఆదేశించింది. అంతకుముందు ఎమ్మెల్యే రాణా గురుజిత్ సింగ్ ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ద్రుష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారందరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
Read This Story Also: Coronavirus: షాకింగ్.. ఒకే ఇంట్లో 26 మందికి కరోనా..!