Coronavirus India News: భారత సైన్యంలో జోరుగా వ్యాక్సినేషన్… పెద్దగా ప్రభావం చూపని కరోనా సెకండ్ వేవ్

| Edited By: Team Veegam

May 25, 2021 | 6:34 PM

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని భయపెడుతోంది. వ్యాక్సినేషన్ పూర్తికావడంతో కొన్ని దేశాలు దాదాపుగా కరోనాను జయించగా...మరికొన్ని దేశాల్లో ఈ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దేశ భద్రతలో నిమగ్నమయ్యే భారత సైన్యం కరోనాను ఎదుర్కొనే విషయంలో కీలక పురోగతిని సాధించింది.

Coronavirus India News: భారత సైన్యంలో జోరుగా వ్యాక్సినేషన్... పెద్దగా ప్రభావం చూపని కరోనా సెకండ్ వేవ్
Indian Army Corona vaccination
Follow us on

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని భయపెడుతోంది. వ్యాక్సినేషన్ పూర్తికావడంతో కొన్ని దేశాలు దాదాపుగా కరోనాను జయించగా…మరికొన్ని దేశాల్లో ఈ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దేశ భద్రతలో నిమగ్నమయ్యే భారత సైన్యం కరోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కొనే విషయంలో కీలక పురోగతిని సాధించింది. ఇప్పటికే భారత సైన్యంలో కరోనా వ్యాక్సినేషన్‌ 90 శాతం మేర పూర్తయ్యింది. 97 శాతం మంది తొలి టీకా వేసుకున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ దాదాపు చివరి దశకు చేరుకోవడంతో సెకండ్ వేవ్‌ భారత ఆర్మీపై పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. భారత ఆర్మీలో తొలి కరోనా పాజిటీవ్ కేసు 2020 మార్చి 17న నమోదయ్యింది.  లేహ్ ప్రాంతానికి చెందిన సైనికుడికి కోవిడ్19 పాజిటీవ్ అని తేలింది. ఇటీవల ఇరాన్‌కు వెళ్లి వచ్చిన సైనికుడి తండ్రి, ఆయనతో కలిసి ఉండటంతో కరోనా సోకి ఉండొచ్చునని భావిస్తున్నారు

రాజ్యసభలో రక్షణ శాఖ సహాయ మంత్రి చెప్పిన దాని ప్రకారం..2020 మార్చి నుండి 2021 ఫిబ్రవరి వరకూ భారత త్రివిధ దళాల్లో మొత్తం 42,848 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సైన్యంలో 32 వేలు, ఎయిర్​ఫోర్స్​లో 6,544, నేవీలో 3,604 మంది సిబ్బందికి కరోనా సోకింది. మొదటి దశలో కరోనా కారణంగా దాదాపు 119 మంది మరణించారు.

కరోనా మొదటి వేవ్‌లో మొత్తం త్రివిధ దళాలలో…
భారత సైన్యంలో 32,690 మందికి కరోనా సోకగా మరణాల రేటు 0.24 శాతం
వాయు సేనలో 6,554 కేసులు నమోదు కాగా, మరణాల రేటు 0.39 శాతం
నావికా దళంలో 3,604 మందికి కరోనా సోకగా మరణాల రేటు 0.05 శాతం

కరోనా సెకండ్‌ వేవ్‌‌…
కొవిడ్ రెండో దశను సైనిక దళాలు అద్భుతంగా ఎదుర్కొంటున్నాయి. భారత సాయుధ బలగాల్లో మొత్తం సిబ్బంది దాదాపు 17 లక్షల మంది. సాయుధ దళాల్లో నమోదైన కరోనా కేసుల్లో అత్యధిక శాతం మందిలో ఎటువంటి లక్షణాలు లేవు. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండానే కోలుకున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.

Covid Vaccine

అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ…

కాగా త్రివిధ దళాల్లో అత్యంత వేగంగా టీకా కార్యక్రమం కొనసాగుతోంది. మొత్తం మీద 90 శాతం మంది రెండు డోసుల టీకాలు తీసుకున్నారు. సైనిక దళాల్లో టీకాలు తీసుకున్న వారిలో 0.40శాతం మందికి మాత్రమే మళ్లీ కొవిడ్ బారినపడ్డారు. వీరిలో ఆసుపత్రిపాలయినవారు 0.004 శాతం మంది మాత్రమే. సాయుధ బలగాల్లో కొవిడ్ సోకిన వారిలో కూడా 1శాతం మాత్రమే ఆసుపత్రిలో చేరారని ఆర్మీవర్గాలు తెలిపాయి. దేశంలో  సెకండ్ వేవ్లో సైన్యంలో నిత్యం 200 కరోనా కేసులు నమోదవుతుండగా…వీరిలో కూడా 140 కేసులు కేవలం ఆర్మీ నుంచే. ప్రస్తుతం ఆ సంఖ్య కూడా చాలా వరకు తగ్గుతున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ కొవిడ్ కేసులు నగరాల్లో ఉన్న కంటోన్మెంట్లు వంటి ప్రాంతాల్లోనే నమోదవుతోంది. సరిహద్దుల్లో ఉన్న వారిలో కేసులు నమోదు కాలేదు. సైనిక దళాల్లో కేసులు తగ్గినా.. క్వారంటైన్ వంటి కొవిడ్ ప్రొటోకాల్ పాటిస్తున్నారు.

త్రివిధ దళాల్లో 2021 మే 19 నాటికి మొత్తం 52 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇప్పటివరకూ కొవిడ్ కారణంగా  142 మంది మృతి చెందారు. సైనిక దళాల కుటుంబ సభ్యుల్లో కూడా 14వేల మందికి కరోనా సోకింది. సెకండ్ వేవ్లో  మే 10 నాటికి 5,134 యాక్టివ్ కేసులు ఉండగా…రికవరీ రేటు 90 శాతంగా ఉంది. ప్రస్తుతం త్రివిధ దళాల్లో 97శాతం మందికి ఒక డోసు టీకా వేయగా…90శాతం మందికి రెండో డోసు కూడా పూర్తయ్యింది.

దేశంలోని మిలిటరీ హాస్పిటల్స్‌లో గతంలో 1,800 ఆక్సిజన్‌ బెడ్స్‌ అందుబాటులో ఉండగా..సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం ఆ సంఖ్యను 4,800 వరకూ పెంచారు. వీటిలో సైనిక సిబ్బందితోపాటు, సాధారణ ప్రజలకు కూడా చికిత్స అందిస్తున్నారు.  నిబంధనల ప్రకారం… ఏవైనా అంటువ్యాధుల కారణంగా సర్వీసులో ఉన్న సాయుధ దళ సిబ్బంది మరణిస్తే ఎటువంటి ప్రత్యేక పరిహారం ఉండదు. సాధారణంగా ఉండే అన్ని పరిహారాలూ మాత్రం అందుతాయి.

ఇది కూడా చదవండి.. కరోనా తాకిడికి ఆర్థిక రంగం కుదేలు.. ఉద్దీపన ప్యాకేజీ రూపకల్పనలో కేంద్ర ప్రభుత్వం!

ప్రపంచ కుబేరుడిగా అమెజాన్ జెఫ్ బెజోస్..ఆయన ఆస్తుల ప్రస్తుత విలువ ఎంతంటే..