ఇంగ్లాండ్ పర్యటనకు వెళాల్సిన తమ క్రికెటర్లకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గతంలో కరోనా పరీక్షలను నిర్వహించగా.. పది మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. ఇటీవల నిర్వహించిన రెండోసారి పరీక్షల్లో ఆరుగురికి నెగిటివ్ రాగా.. తాజాగా ఆ ఆరుగురు ఫఖర్ జమాన్, మహ్మద్ హస్నేన్, హఫీజ్, రిజ్వాన్, షాదబ్ ఖాన్, వాహబ్ రియాజ్లకు మరోసారి నెగిటివ్ వచ్చింది. దీంతో వీరంతా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లేందుకు అర్హత సాధించినట్లు పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది.
కాగా, పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆదివారం ఇంగ్లాండ్ కు చేరుకుంది. 20మంది ఆటగాళ్లతోపాటు 31మంది సభ్యుల పాకిస్థాన్ బృందం ఇంగ్లాండ్ లో అడుగుపెట్టింది. కరోనా వైరస్ సోకిన 10మంది క్రికెటర్లలో ఆరుగురికి రెండోసారి పరీక్షించినపుడు నెగిటివ్ వచ్చినా వారిని ప్రయాణించేందుకు అనుమతించలేదు. పాక్ క్రికెటర్లు, 11మంది సహాయక సిబ్బంది లాహోర్ నుంచి చార్టర్డ్ విమానంలో వోర్సెస్టర్షైర్కు చేరుకున్నారని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రతినిధులు తెలిపారు.
ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వారు 14రోజుల ఐసోలేషన్కు వెళ్లేముందు వైద్యపరీక్షలకు ఏర్పాట్లు చేసింది. క్వారంటైన్ అనంతరం ఆగస్టు-సెప్టెంబర్లో ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్లు మూడు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్ల్లో తలపడతాయి. పాక్ జట్టు జులై 13న డెర్బీషైర్కు వెళ్లనుంది. నెగిటివ్ వచ్చిన ఆరుగురు పాక్ క్రికెటర్లకు వచ్చేవారం మూడోరౌండ్ పరీక్షలు జరపనున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఆదివారం ఇంగ్లాండ్ కు చేరుకున్న ఆటగాళ్లలో అజార్ అలీ (కెప్టెన్), బాబర్ ఆజం, అబిద్ అలీ, అసద్ షఫీక్, ఫహీమ్ అష్రాఫ్, ఫవాద్ ఆలం, ఇఫ్తీఖర్ అహ్మద్, ఇమాద్ వసీమ్, ఇమామ్ ఉల్ హక్, ఖుఫ్దిల్ షా, మహ్మద్ అబ్బాస్, మూసాఖాన్, నసీంషా, రోహైల్ నజీర్, సర్ఫరాజ్ అహ్మద్, షా అఫ్రిది, షాన్ మసూద్, సోహైల్ఖాన్, ఉస్మాన్, యాసిర్ షా తదితరులు ఉన్నారు.