PM Narendra Modi on Corona: ఓవైపు దేశంలో కొన్ని రాష్ట్రాల మినహా తగ్గుతున్న కరోనా ఉధృతి.. మరో వైపు కోవిడ్ కోరల్లోంచి విముక్తి కల్పించేందుకు వ్యాక్సిన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు.. దీంతో త్వరలో భారత దేశం కరోనా వైరస్ నుంచి విముక్తి పొందిన మొదటిదేశంగా నిలుస్తుంది ఆశలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా టీకా పంపిణీ పై అన్ని రాష్ట్రాల సీఎం ల తో ప్రధాని మోడీ వర్చువల్ సమావేశంలో భేటీ అయ్యారు. తొలి దశలో భాగంగా మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లకు టీకా ఇవ్వనున్నారు. అయితే ఈ ఖర్చంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, రాష్ట్రాలపై ఎలాంటి భారం పడదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ కొనుగోలును కేంద్రం చేపట్టడమే ఉత్తమమని అన్నారు. రాష్ట్రాలు సేకరణ చేపడితే ధరల్లో వ్యత్సాసం ఉండవచ్చని తెలిపారు. ఒకే ఏజన్సీ కొనుగోలు చేయడం ద్వారా ఒకే ధర సాధ్యపడుతుందని చెప్పారు ప్రధాని మోడీ.
తొలిదశలో మూడుకోట్ల మంది హెల్త్ వర్కకు ఉచితంగా టీకాను అందించనున్నామని చెప్పారు. వ్యాక్సిన్ పై వస్తున్న పుకార్లు నమ్మవద్దన్నారు మోడీ. తొలి దశలో ప్రజా ప్రతినిధులు ఉండబోరని మోదీ స్పష్టం చేశారు. రెండో దశలో 50ఏళ్ల పైబడిన వారికి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 50ఏళ్ల లోపువారికి ప్రాధాన్యమిస్తామన్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కేవలం 2.5కోట్ల మంది మాత్రమే టీకా తీసుకున్నారని మోడీ అన్నారు. జులై నాటికి దేశంలో 30కోట్ల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాతే వ్యాక్సిన్లపై నిర్ణయం తీసుకున్నామని ప్రధాని తెలిపారు. ఇప్పటికే రెండు స్వదేశీ టీకాలకు అనుమతినివ్వగా.. మరో నాలుగు వ్యాక్సిన్లను కూడా త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. టీకా తీసుకున్న ప్రతి ఒక్కరికీ డిజిటల్ సర్టిఫికేట్ను జనరేట్ చేయాలన్నారు. దీని వల్ల రెండో డోసు ఇవ్వడం సులభమవుతుందని చెప్పారు. అంతేకాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కరోనా కట్టడి కోసం అద్భుతంగా కలిసి పనిచేశాయన్నారు.